ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకనిర్మాత దివంగత యష్ చోప్రా సతీమణి పమేలా చోప్రా (74) గురువారం ముంబయిలో కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రస్థానంలో భర్త యష్చోప్రాతో పాటు పమేలా చోప్రా కీలక భూమిక పోషించారు. కేవలం కుటుంబ బాధ్యతలకు మాత్రమే పరిమితం కాకుండా నేపథ్యగాయనిగా, రచయితగా, కాస్ట్యూమ్ డిజైనర్గా పమేలా చోప్రా పేరు తెచ్చుకుంది.
యష్రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన పలు చిత్రాల్లో ఆమె పాటలు పాడింది. సినిమాల స్క్రిప్ట్ రచనలో కూడా పాలుపంచుకుంది. ప్రస్తుతం ఆమె కుమారులు ఆదిత్య చోప్రా, ఉదయ్చోప్రా యష్రాజ్ ఫిల్మ్స్కు సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. పమేలా చోప్రా మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అగ్ర హీరోలు షారుఖ్ఖాన్, అమీర్ఖాన్, హృతిక్రోషన్ తదితరులు ముంబయిలోని నిర్మాత ఆదిత్యచోప్రా గృహానికి చేరుకొని పమేలా చోప్రా పార్థివ దేహానికి నివాళులర్పించారు.