ముంబై: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న రామయ్య ప్రాణ ప్రతిష్ఠాపన అంగరంగ వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలకు ఓ వైపు చకాచకా ఏర్పాట్లు సాగుతుండగా.. మరో వైపు శ్రీరామజన్మభూమి తీర్థకేత్ర ట్రస్ట్ వేడుకకు హాజరుకావాలని ప్రముఖులకు ఆహ్వానాలను (Invitation) పంపుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖుకు ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే.
తాజాగా బాలీవుడ్ జంట రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్కు (Alia Bhatt) అధికారికంగా ఆహ్వానాలు అందాయి. ఆర్ఎస్ఎస్ నేతలు సునీల్ అంబేకర్, అఖిల్ భారతీయ, అజయ్ ముద్పే ప్రముఖ నిర్మాత మహవీర్ జైన్తో కలిసి వారి నివాసంలో ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఇప్పటికే ప్రముఖ నటుడు రజనీ కాంత్, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్తోపా పలువురు సినీ ప్రముఖులకు రాముని ప్రతిష్ఠాపనకు రావాల్సింది ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత చివరకు నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణానికి సమ్మతించింది.. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేయగా.. జనవరి 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha)కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 16న వేడుకలు మొదలై.. అదే నెల 22న ముగియనున్నాయి.
జనవరి 15 నాటికి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. 22న గర్భాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగనుండగా.. ప్రధాని మోదీ హాజరవనున్నారు. ఈ వేడుకకు రాజకీయ నాయకులతోపాటు బౌద్ధ మత గురువు దలైలామా, ముఖేష్ అంబానీతో పాటు నటీనటులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరవనున్నారు. మరో వైపు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ నేపథ్యంలో దేశమంతా వేడుకలు నిర్వహించనున్నారు.