Keerthi Bhat | ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. అమాయకుల ఆశలు, అవసరాలను ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. రకరకాలుగా మభ్యపెట్టి అకౌంట్లలో దాచుకున్న సొమ్మును కాజేస్తున్నారు. తాజాగా బిగ్బాస్ బ్యూటీ, సీరియల్ నటి కీర్త భట్ కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది. కొరియర్ కోసం ఓ లింక్పై క్లిక్ చేసి సుమారు 2 లక్షల రూపాయలను పోగొట్టుకుంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ద్వారా వివరంగా తెలియజేస్తూ బాధపడింది.
తనకు రావాల్సిన ఓ కొరియర్ ఆలస్యం కావడంతో ఇటీవల ఆమె కొరియర్ వాళ్లకు కాల్ చేసిందట. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో నెంబర్ నుంచి కాల్ చేసి మీ అడ్రస్ అప్డేట్ లేకపోవడంతో కొరియర్ రాలేదని చెప్పారు. లొకేషన్ అప్డేషన్ కోసం వాట్సాప్లో అడ్రస్ పంపించమని అడిగారు. వాళ్ల మాటలు నమ్మి కీర్తి భట్ వాట్సాప్లో లొకేషన్ షేర్ చేసింది. ఆ తర్వాత నార్మల్ మెసేజ్ చేయమని చెప్పారు. వాళ్లు చెప్పినట్టే కీర్తి భట్ చేసింది. అయితే అడ్రస్ అప్డేషన్కు రెండు రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందని చెప్పి ఒక లింక్ పంపించారు. వాళ్లు పంపించిన లింక్పై క్లిక్ చేయగానే 2రూపాయలు కట్ అయ్యాయి. సర్లే అనుకుని కీర్తి భట్ షూటింగ్కు వెళ్లిపోయింది. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో 99 వేలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే మరో 99వేలు కూడా కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఏం చేయాలో అర్థం కాక తన భర్తతో కలిసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేశారు. డబ్బులు కట్ అయిన వెంటనే ఫిర్యాదు చేశారు కాబట్టి వెంటనే వాళ్ల అకౌంట్లు బ్లాక్ చేయించగలిగామని.. కచ్చితంగా డబ్బులు తిరిగి వస్తాయని చెప్పారని కీర్తి భట్ ఆ వీడియోలో తెలిపింది. ఇలాంటి సైబర్ నేరాలు మీకు జరగవచ్చు.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కీర్తి భట్ తన ఫ్యాన్స్కు సలహా ఇచ్చింది. సైబర్ నేరాలు జరిగినప్పుడు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సూచించింది.