Bhumi Pednekar | ‘పురుషాధిక్యత అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడటానికి కూడా నేను ఇష్టపడను. స్త్రీని తక్కువ చేసి ఎవరు మాట్లాడినా నేను భరించలేను. అలాంటివాళ్లను చూస్తే నాకు అసహ్యం. అయితే.. కోపం అర్థవంతంగా ఉండాలి. స్పందనలో నిజాయితీ ఉండాలి. మనకు నచ్చిందే కరెక్టని వాదించడం మూర్ఖత్వం అవుతుంది.
కళాప్రక్రియలన్నింటినీ కళాత్మకంగానే చూడాలి. కళాకారులకు విశాల దృక్పధం అవసరం’ అంటూ తన మనసును ఆవిష్కరించింది భూమీ పెడ్నేకర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘యానిమల్’ సినిమాపై వస్తున్న విమర్శలపై ఆమె పై రీతిగా స్పందించింది. ‘ సందీప్రెడ్డి వంగా కథను దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. కథ అంటే వ్యక్తిత్వాల సమాహారం. అవి విభిన్నంగా ఉంటాయి. దాన్ని మనం కళారూపంగా చూడాలే తప్ప, అదేదో మన సమస్యగా భావించి మాట్లాడకూడదు.
తను అనుకున్న వ్యక్తిత్వాలను సందీప్ అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ఆ విధంగా అతడ్ని అభినందించాలి. తన నుండి అన్నీ ఇలాంటివే వస్తాయని అనుకోకూడదు. తను మంచి దర్శకుడు. దీనికి భిన్నమైన సినిమా కూడా అతన్నుంచి ఆశించొచ్చు. నా వరకు ఒక నటిగా చెబుతున్నాను. ఇందులో నటించిన నటీనటులందరూ అద్భుతంగా నటించారు. సినిమాను సినిమాగా చూడండి’ అంటూ చెప్పుకొచ్చింది భూమి పెడ్నేకర్.