ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్య కథాంశంతో శర్వానంద్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘భోగి’ చిత్రం నిర్మాణ దశలోనే ఆసక్తిని రేకెత్తిస్తున్నది. సంపత్నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్న డింపుల్ హయాతి ఫస్ట్లుక్ను సోమవారం విడుదల చేశారు.
ఇందులో ఆమె ‘మందారం’ అనే పాత్రలో కనిపించనుంది. ఫస్ట్లుక్లో ఎర్రచీర ధరించి చేతిలో విసన కర్రతో ఆకర్షణీయంగా డింపుల్ హయాతి కనిపిస్తున్నది. ‘ప్రపంచం కోరుకున్న సౌందర్యం.. ప్రపంచం ఎన్నడూ అర్థం చేసుకోని ఆత్మ..మందారంను పరిచయం చేస్తున్నాం’ అంటూ ఈ ఫొటోపై రాసిన క్యాప్షన్ ఆసక్తికరంగా ఉంది. 1960 దశకం నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా ఇదని, ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుపుతున్నామని మేకర్స్ తెలిపారు. ఆగస్ట్ 28న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలకానుంది.