ఇటీవలే ‘లెనిన్’ సినిమాతో కెరీర్లో భారీ విజయాన్ని దక్కించుకుంది మరాఠీ సుందరి భాగ్యశ్రీ బోర్సే. టాలీవుడ్లో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లభించిన ఈ సక్సెస్ పట్ల ఆమె సంతోషంగా ఉంది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న ఈ సొగసరి త్వరలో బాలీవుడ్లో నాయికగా ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఆదిత్యరాయ్ కపూర్ సరసన భాగ్యశ్రీ బోర్సే ఓ మ్యూజికల్ లవ్స్టోరీలో నటించనుంది. మిలాప్ మిలాన్ జవేరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మించనున్నారు.
త్వరలో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది. బాలీవుడ్లో ఇప్పటికే యారియాన్, చందూ ఛాంపియన్ వంటి చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసింది భాగ్యశ్రీ బోర్సే. అయితే కథానాయికగా మాత్రం ఆమెకిది తొలి అవకాశం కావడం విశేషం. ప్రస్తుతం ఈ భామ తమిళంలో ‘సేయాన్’ చిత్రంలో నటిస్తున్నది. తెలుగులో కొన్ని భారీ సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.