Bhagyaraj | ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత కె. భాగ్యరాజ్ శనివారం (జూన్ 27) ఉదయం చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తమిళంతో పాటు తెలుగు సినీ పరిశ్రమను కూడా విషాదంలో ముంచెత్తింది.దాదాపు ఐదు దశాబ్దాలపాటు సినీ రంగంలో విశేష సేవలందించిన కె. భాగ్యరాజ్ తన రచన, దర్శకత్వం, నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. ఇటీవలే తమిళ చిత్ర పరిశ్రమ మరో ప్రముఖ దర్శకుడు భారతీరాజాను కోల్పోగా, కొద్ది రోజుల వ్యవధిలోనే మరో సినీ దిగ్గజాన్ని కోల్పోవడం తమిళ సినీ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
భాగ్యరాజ్ను భారతీయ సినీ పరిశ్రమలో ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ప్లే’గా అభిమానులు, సినీ విమర్శకులు అభివర్ణిస్తుంటారు. కుటుంబ కథలు, హాస్యం, ప్రేమ, సామాజిక అంశాలను కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను రూపొందించడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉండేది. మధ్యతరగతి కుటుంబాల జీవితాలను సహజంగా తెరపై ఆవిష్కరించడం, సరదా సంభాషణలు, భావోద్వేగపూరిత కథనాలతో ఆయన చిత్రాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. 1979లో విడుదలైన ‘సువరిల్లాద చిత్రంగల్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన భాగ్యరాజ్, తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత వరుస విజయాలతో తమిళ సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుల జాబితాలో చేరారు.
కె. భాగ్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరయ్యారు. ఆయన కథల ఆధారంగా అనేక తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. విక్టరీ వెంకటేష్ నటించిన ‘సుందరకాండ’, ‘అబ్బాయిగారు’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వంటి చిత్రాలకు ఆయన కథ అందించారు. ‘అబ్బాయిగారు’ చిత్రానికి స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. ఆయన రచనా శైలి, కుటుంబ కథలను చెప్పే తీరు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ భాగ్యరాజ్ విశేష గుర్తింపు పొందారు. దాదాపు 75కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తన చిత్రాల్లో సాధారణ మనిషి పాత్రలను పోషిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నారు. కె. భాగ్యరాజ్కి పూర్ణిమ భాగ్యరాజ్, కుమార్తె శరణ్య భాగ్యరాజ్, కుమారుడు శాంతను భాగ్యరాజ్ ఉన్నారు.