తన కుటుంబం ఎదుగుదల చూడలేకనే కొందరు కుట్ర పన్నుతున్నారని అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. శరణ్ అనే వ్యక్తి నుంచి తాను పైసా తీసుకోలేదని, డబ్బులు ఇచ్చినట్లు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇవ్వొచ్చని ఆయన చెప్పారు. శనివారం హైదరాబాద్ ఫిలింఛాంబర్లో పాత్రికేయ సమావేశంలో బెల్లంకొండ సురేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ…‘శరణ్ది మా ఊరే. పదేళ్లుగా పరిచయం. సినిమా టికెట్ల కోసం ఫోన్లు చేసేవాడు. ఆ పరిచయం అడ్డుపెట్టుకుని కుట్రపన్నాడు. అతను 85 లక్షల రూపాయలు ఇస్తే రుజువు చూపించాలి. లేదంటే శరణ్ మీద పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు పెడతా. ఒక్క పైసా అతని దగ్గర నుంచి తీసుకోలేదు. నా కుటుంబం ఎదుగదల చూడలేకే ఇలాంటి కేసులు పెడుతున్నారు. నా కొడుకులను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఇప్పటిదాకా పోలీసుల నుంచి గానీ సీసీఎస్ నుంచి గానీ ఎలాంటి నోటీసులు అందలేదు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తా’ అన్నారు.