నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు గణేష్ కథానాయకుడిగా ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా రాకేష్ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సతీష్వర్మ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో గణేష్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్రాజు క్లాప్నివ్వగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విఛాన్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ “నాంది’ విజయం తర్వాత మా సంస్థలో రూపొందుతున్న చిత్రమిది. న్యూఏజ్ థ్రిల్లర్గా నవ్యానుభూతిని పంచుతుంది. తేజ శిష్యుడు రాకేష్ విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న మూడో చిత్రమిది. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు: కృష్ణచైతన్య, సంగీతం: మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ: అనిత్.