Bandla Ganesh | యూట్యూబ్ ద్వారా కామెడీ కంటెంట్తో యూత్ను ఆకట్టుకున్న మౌళి తనూజ్ , ‘#90స్’ వెబ్ సిరీస్ ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో హీరోగా తెరపైకి వచ్చాడు. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ సినిమా కి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ రాబడుతోంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ సాధించిందన్న వార్తలతో, మౌళిపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.. అయితే ఈ సమయంలో బండ్ల గణేష్ పెట్టిన ఒక ట్వీట్ , ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది.
బండ్ల గణేష్, ఇటీవల సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నారు. ముఖ్యంగా ట్విటర్ ద్వారా సెలెబ్రిటీలకు విషెస్ చెబుతూ ఉండే గణేష్.. ఇప్పుడు మౌళిపై పెట్టిన ఓ పోస్ట్తో వివాదంలో పడ్డారు. గణేష్ తన పోస్ట్లో.. కొడితే నీలా కొట్టాలిరా బాబు దెబ్బ.. చంపేసావు.. ఇక దున్నేయ్ టాలీవుడ్ నీదే అని చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఈ పోస్ట్ ద్వారా మౌళిని మెచ్చుకున్నట్టే ఉన్నా గతంలోని ఓ రాజకీయ వివాదాన్ని చర్చకు తీసుకువచ్చినట్టు అయింది. దీంతో ఈ ట్వీట్కు మిశ్రమ స్పందన వస్తోంది. మౌళి నటుడిగా మారకముందు యూట్యూబ్ కామెడీ వీడియోలతో ఫేమ్ సంపాదించాడు. కానీ 2023లో, ఒక వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చేసిన జోక్ వైరల్ కావడంతో రాజకీయ వివాదంలో చిక్కుకున్నాడు. అప్పట్లో వైసీపీ మద్దతుదారులు తీవ్ర విమర్శలు చేయడంతో మౌళి తన మాటలపై బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
నా జోక్ వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి. రాజకీయ అజెండా ఏదీ లేదు. కుటుంబాన్ని లాగవద్దు అని మౌళి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన ట్వీట్, ఆ పాత జోక్ను గుర్తు చేస్తూ, మరోసారి మౌళిని చర్చలోకి తీసుకువచ్చినట్టు కనిపిస్తోంది. మౌళి కొత్త సినిమా మంచి రెస్పాన్స్తో ముందుకు సాగుతున్న సమయంలో, బండ్ల గణేష్ ట్వీట్ వల్ల ఒక వర్గం ప్రేక్షకుల్లో నెగటివ్ ప్రభావం ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే బండ్ల గణేష్ ఆ పోస్ట్ను తర్వాత డిలీట్ చేసి కొత్తగా మరో మెచ్చుకునే పోస్టు పెట్టినా, అప్పటికే అసలు ట్వీట్ స్క్రీన్షాట్ల రూపంలో వైరల్ అయిపోయింది.