Bandla Ganesh | హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్యాండ్ మేళం’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘కోర్ట్’ సినిమాలో జంటగా ఆకట్టుకున్న ఈ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు సతీశ్ జవ్వాజి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కోన వెంకట్ నిర్మించారు. శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 26న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సోమవారం సాయంత్రం గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణు, దర్శకులు వీవీ వినాయక్, బాబీ కొల్లి, అలాగే నిర్మాత బండ్ల గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో ముఖ్యంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.
హర్ష్ రోషన్ ప్రతిభపై ప్రశంసలు కురిపించిన బండ్ల గణేష్, “హర్ష్ రోషన్ నా కొడుకైతే ఎంత బాగుండేది అనిపించింది. అతడిలో మంచి టాలెంట్ ఉంది. భవిష్యత్తులో అతడు ఇంకో నానిలా ఎదగగలడు” అని అన్నారు. అలాగే సినీ పరిశ్రమలో స్టార్ హీరోల వారసులు స్టార్ అవడం చాలా అరుదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో మహేష్ బాబు, రామ్ చరణ్ ఉదాహరణలుగా చెబుతూ, వారసత్వంగా ఆస్తులు అందుతాయి కానీ సక్సెస్ మాత్రం ప్రతి ఒక్కరూ తమ ప్రతిభతోనే సాధించాల్సి ఉంటుందని చెప్పారు.ఇక నిర్మాత కోన వెంకట్ గురించి మాట్లాడుతూ బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇండస్ట్రీ మొత్తం ఒక వైపు ఉన్నా, కోన వెంకట్ వైపు ఉంటే విజయం సాధించొచ్చు అని వీవీ వినాయక్ చెప్పాడు. కోన వెంకట్ ఈ సినిమా కోసం తన ఆస్తులను అమ్మి మరీ ‘బ్యాండ్ మేళం’ తెరకెక్కించాడు” అని తెలిపారు.
కోన వెంకట్ సినీ రంగానికి చేసిన సేవలను కూడా ఆయన గుర్తు చేశారు. దర్శకులు హరీష్ శంకర్, బాబీ, గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ వంటి ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించిన వ్యక్తి కోన వెంకట్ అని కొనియాడారు. మొత్తంగా ‘బ్యాండ్ మేళం’ ప్రీరిలీజ్ ఈవెంట్ సందడి నడుమ, బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక శ్రీరామ నవమి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.