‘కోర్ట్’ జోడీ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన వినోదాత్మక యువతరం సినిమా ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకుడు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. మార్చి 26న శ్రీరామనవమి కానుకగా సినిమా థియేటర్లలో విడుదల కానున్నది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అగ్ర కథానాయకుడు చిరంజీవి ట్రైలర్ని విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. యువతరంతోపాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా కనెక్టయ్యే ప్రేమకథ ఇదని ట్రైలర్ చెబుతున్నది.
ట్రైలర్లో హీరోహీరోయిన్ల గిల్లికజ్జాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇందులో వారిద్దరూ బావామరదళ్లని, మరదలి ప్రేమను గెలిచేందుకు బావ ఏం చేశాడు? తనకు ఎదురయ్యే సమస్యలేంటి? వాటిని ఎలా అధిగమించాడు? అనే అంశాలతో ‘బ్యాండ్మేళం’ రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సాయికుమార్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ ముత్యాల, సంగీతం: విజయ్ బుల్గానిన్, సమర్పణ: కోన వెంకట్ ప్రొడక్షన్స్, నిర్మాణం: కోన ఫిల్మ్ కార్పొరేషన్.