Bala Krishna | నందమూరి నటసింహం బాలయ్య రీసెంట్గా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఆయనకి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పౌరసన్మాన సభ పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి బాలయ్య తన సతీమణి వసుంధరతో కలిసి హాజరయ్యారు. వేలాదిగా విచ్చేసిన అభిమానులు, నందమూరి కుటుంబసభ్యుల మధ్య అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా కొనసాగిన హీరో నేనొక్కడినేనంటూ కరతాళ ధ్వనుల మధ్య గర్వంగా చెప్పారు.
సినిమా ఈవెంట్ కంటే ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు. నేను భగవంతుడికి అభిమానులకు మధ్య సందానకర్తని. ఎందుకంటే నాకు పద్మభూషణ్ వస్తే మీరు సొంతంగా భావించి ఇలా పండగలా జరుపుకుంటున్నారు. నాన్న తర్వాత మా అన్న హరికృష్ణ, ఆ తర్వాత నన్ను మీవాడిలా మీలో ఒకడిగా మీ గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. నా గుండెల్లో మీరంతా సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా అని బాలయ్య అన్నారు. నాన్న శతజయంతి జరపుకోవడం, మూడోసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా 15వ సంవత్సరంలో అడుగుపెట్టడం.. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ నాలుగు వరుస హిట్లు అందుకోవడం.. హీరోగా 50 ఏళ్లు పూర్తికావడం.. ఈ తరుణంలో పద్మభూషణ్ రావడం బాగుంది.
50 సంవత్సరాలుగా హీరోగా నటించిన నటుడు ప్రపంచంలో ఎవడూ లేడు. చాలామంది హీరోలు మధ్యలో క్యారక్టర్ ఆర్టిస్టులుగా దారి మళ్ళడం జరిగింది కానీ 50 ఏళ్లు హీరోగా నిలబడటానికి శక్తినిచ్చిన తెలుగు జాతికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఏం చూసుకుని.. బాలకృష్ణకు అంత పొగరు అని అందరు అంటుంటారు. నన్ను చూసుకునే నాకు పొగరు అని నేను అంటాను. నా మాట సూటిగా ఉంటుంది.. నా బాట ముక్కుసూటిగా ఉంటుంది అని బాలయ్య అన్నారు. ప్రస్తుతం అఖండ 2 చేస్తున్న బాలయ్య ఆ సినిమాని దసరా పండగకి రిలీజ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. 2026 సంక్రాంతి వైపు చూస్తున్నారని ఆల్రెడీ టాక్ ఉంది. అయితే ఇక్కడి నుంచి నేనేంటో చూపిస్తా. తెలుగు సినీ పరిశ్రమలో ఇక నుంచి మీరు ఊహించనటువంటి సినిమాలు చేస్తాను అంటూ బాలయ్య చాలా జోష్తో చెప్పుకొచ్చారు.