అగ్ర కథానాయకుడు బాలకృష్ణ నటిస్తున్న 112వ సినిమా గురువారం ఏపీ రాజధాని అమరావతిలో లాంఛనంగా ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆయన అల్లుడు నారా లోకేష్ క్లాప్నివ్వగా, కుమార్తె తేజస్విని గౌరవ దర్శకత్వం వహించారు.
బాలకృష్ణకు తాను వీరాభిమానినని, ఆయన సినిమాకు దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నానని దర్శకుడు కొరటాల శివ పేర్కొన్నారు. ఈ దర్శకుడు, నిర్మాణ సంస్థతో తొలిసారి పనిచేస్తున్నానని, ఇదొక ప్రత్యేకమైన సందర్భమని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ ఇమేజ్కు సరిపోయే విధంగా కమర్షియల్ అంశాలతో పాటు బలమైన భావోద్వేగాలతో దర్శకుడు కొరటాల శివ అద్భుతమైన కథను సిద్ధం చేశారని, అభిమానులకు ఈ సినిమా ఓ పండగలా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు, ఇతర తారాగణం వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.