‘ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ‘సమరసింహారెడ్డి’ చిత్ర శతదినోత్సవ వేడుకలు ఇక్కడే జరిగాయి. ఇక్కడ ఎన్నో మధురానుభూతులున్నాయి’ అని చెప్పారు బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ సినిమా అర్ధ శతదినోత్సవ వేడుకలు గురువారం హైదరాబాద్లో జరిగాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘నాన్నగారు చేసిన పాత్రల్ని గుర్తుచేసుకుంటూ ఈ సినిమాలో నేను శివ భక్తుడు అఖండ పాత్రను పోషించా. కరోనా సమయంలో ప్రేక్షకులు థియేటర్కు వస్తారో లేదో అనుకున్నా. కానీ తీర్థయాత్రలకు వచ్చినట్లు ఈ సినిమా థియేటర్లకు వస్తున్నారు. ఇది ప్రేక్షకులు అందించిన విజయం. బోయపాటి శ్రీనుతో నేను హ్యాట్రిక్ కొట్టాను. మా కలయిక జన్మజన్మలది. ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు. ఈ సినిమా ద్వారా ధర్మానికి ప్రమాదం ఏర్పడినప్పుడు దేవుడు అఖండ రూపంలో వచ్చి దుష్టులకు బుద్ధి చెబుతాడనే సందేశాన్నందించాం. ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా. ఈ సినిమాను ఎన్టీఆర్కు అంకితమిస్తున్నా’ అని అన్నారు. చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి మాట్లాడుతూ ‘ప్రేక్షకులు అభిమానాన్ని చాటుతూ ఏకధాటిగా యాభైరోజులు సినిమాను నడిపించడం చాలా ఆనందంగా ఉంది. ‘అఖండ’ సినిమాతో మా కలలన్నీ నిజమయ్యాయి’ అని తెలిపారు. అనంతరం బాలకృష్ణ యాభైరోజుల జ్ఞాపికల్ని ఎగ్జిబిటర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నైజాం పంపిణీదారుడు, నిర్మాత శిరీష్రెడ్డి పాల్గొన్నారు.