Balagam | రాజన్నసిరిసిల్ల జిల్లా నుంచి తొలి పెద్ద సినిమా ‘బలగం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్ చెందిన ఎల్దండి వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నది. జిల్లాలోని పలు గ్రామాలలో షూటింగ్ నిర్వహించారు. దీంతో సుమారుగా 200 మందికి పైగా గ్రామస్తులు చిత్రంలో కనిపించబోతున్నారు. జిల్లాలో తొలి పెద్ద సినిమా అయిన బలగం మూవీ మార్చి 3న రిలీజ్ అయి ప్రేక్షకులకు ముందుకు రానుండటంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్కు చెందిన ఎల్దండి వేణు దర్శకత్వంలో ఈ చిత్రం రానున్నది. 1997లో సిరిసిల్ల మార్కెట్లో కూరగాయలు అమ్మిన వేణు ఎల్దండి కమెడియన్గా ఇండ్రస్టీలో అడుగు పెట్టాడు. వేణు టిల్లుగా ప్రసిద్ధిగాంచాడు. తెలుగు పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’తో కమెడియన్గా ఇండ్రస్టీకి పరిచమయ్యాడు.
అలా జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయి తన కామెడీ కిట్లతో అందర్నీ అలరించాడు. ఇండ్రస్టీలో తనకంటూ ఓ ముద్ర వేసుకుని అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుని ‘బలగం’ అనే మూవీకి దర్శకత్వం వహించాడు. అచ్చ తెలంగాణ యాసలో ఈ చిత్రాన్ని రూపొందించాడు.
పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రకృతి అందాలతో పాటు షూటింగ్కు అనువుగా ఉన్న ఓ పాత ఇంటిలో చిత్రీకరించారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో 50 రోజులపాటు ఈ చిత్రాన్ని రూపొందించారు. కోనరావుపేట మండలంలోని కొలనూర్, నాగారం, ధర్మారం, తంగళ్లపల్లి, అగ్రహారం, జిల్లెల్లతో పాటు పలు గ్రామాల్లోని ప్రశాంత వాతావరణంలో సినిమాలోని సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ సినిమాలో 200 మందికి పైగా గ్రామస్తులు వివిధ సన్నివేశాల్లో నటించారు. బంధుత్వాలను కలిపే చిన్నచిన్న డైలాగులతో తొలిసారిగా నటించారు. దీంతో వారంతా తొలిసారిగా తెరపై కనబడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ యాసలో రూపొందిన ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు.
సినీ రంగంలో తెలంగాణను ఒక మోడల్గా నిలిపేందుకు గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. పల్లెటూరిలో మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, బంధుత్వాలు, బంధు బలగాలపై ‘బలగం’ రూపొందించారు. ఈ సినిమా తెలంగాణ యాసలోనే సినిమా కొనసాగనుంది. దిల్రాజు ప్రొడక్షన్స్ శిరీష సమర్పణలో హర్షిత్రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించగా, ప్రియదర్శి, కావ్య కళ్యాణ్రామ్, సుధాకర్రెడ్డి, మురళీధర్గౌడ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. ఈ నెల 28 లేదా మార్చి 1న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జిల్లాలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు.
కొత్త సినిమా కాన్సెప్ట్ సినిమాలను చేస్తూ కొత్త టాలెంట్ను ప్రోత్సహించాలనే ఉద్ధేశంతో హర్షిత్, హన్షిత కలిసి నా పేరుతో ప్రొడక్షన్ను ఆరంభించినట్లు చిత్ర నిర్మాత దిల్రాజు తెలిపారు. ఒకట్రెండు పాత్రలు మినహా మిగిలిన పాత్రలన్నింటిలో కొత్త వారినే తీసుకున్నామన్నారు. ముఖ్యంగా భీమ్స్ సంగీతంలో కాసర్ల శ్యామ్ రాసిన పాటలు హృదయాలకు హత్తుకుంటాయని, ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చడంతో పాటు ఈ సినిమా విజయవంతమవుతుందన్న విశ్వాసం ఉందని దిల్రాజు అన్నారు.