తెలుగు సినీరంగానికి కొత్త వారిని పరిచయం చేస్తూ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ను ప్రారంభించామని చెప్పారు నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి. వారిద్దరూ నిర్మాతలుగా తెరకెక్కించిన ‘బలగం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో హన్షిత రెడ్డి మాట్లాడుతూ ‘హృదయాల్ని తాకే కథతో తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. కథ విన్నప్పుడే భావోద్వేగాలు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయనిపించింది. తెలంగాణ నేపథ్య కథ అయినా ఆంధ్ర, రాయలసీమలో కూడా మంచి వసూళ్లను సాధిస్తున్నది. ప్రయోగాత్మక చిత్రాలు చేయాలన్న లక్ష్యంతో ఈ బ్యానర్ను స్థాపించాం. మా నాన్న దిల్రాజుగారు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మా బ్యానర్లో మాత్రం కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తాం. భవిష్యత్తులో అన్ని జోనర్స్ చిత్రాలు చేస్తాం’ అని అన్నారు. హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘చిరంజీవిగారు మా చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ‘బలగం’ చక్కటి గ్రామీణ కథతో ప్రతి ఒక్కరిని మెప్పిస్తున్నది. ప్రస్తుతం మా సంస్థలో యష్ మాస్టర్ కథానాయకుడిగా ఓ సినిమా చేస్తున్నాం. శశి దర్శకత్వం వహిస్తారు. వేణు ఎల్దండి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఓ పెద్ద సినిమా చేయబోతున్నది’ అన్నారు.