‘తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో గొప్ప సినిమా తీసినందుకు దర్శకుడు వేణును అభినందిస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో జీవితంపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఈ సినిమాలోని పాత్రలన్నీ మన కుటుంబాల్లో కనిపించేవే. కమర్షియల్ అంశాలకు దూరంగా నిజమైన తెలంగాణ కథను చూపించారు’ అని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ‘బలగం’ చిత్ర విజయోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. దిల్రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ‘వెనకటి రోజుల్లో కాకులు పిండాలను ముట్టకపోతే భోజనాలు కూడా చేసేవాళ్లు కాదు. ఇలాంటి నిజ జీవిత సంఘటనల్ని తెరపై హృద్యంగా ఆవిష్కరించారు.
ఈ సినిమా ైక్లెమాక్స్ చూసి నేను ఏడుపు ఆపుకోలేకపోయాను. నిజ జీవితాల్ని ప్రతిబింబించే ఇలాంటి సినిమాలు తీయాలని దర్శకనిర్మాతలను కోరుతున్నా’ అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ‘తెలంగాణ వచ్చిన తర్వాత మట్టిలో మాణిక్యాలు బయటకొస్తున్నారనడానికి ఈ బలగమే నిదర్శనం. ఆస్తుల కంటే ప్రేమాభిమానాలే శాశ్వతమని ఈ సినిమాలో చూపించారు. నటీనటులందరూ తమ పాత్రల్లో జీవించారు. గ్రామీణులందరికి ఈ కథ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలోని సందేశం ప్రతి ఒక్కరికి చేరాలి’ అన్నారు. దిల్రాజు మాట్లాడుతూ ‘ ఒక మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ కంటే ఎంత మంది ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూస్తున్నారనే విషయం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా. మొదటి రోజు 30వేల మందితో మొదలై వారం పూర్తయ్యే సరికి రెండు రాష్ర్టాల్లో నాలుగులక్షల మంది సినిమా చూశారు.
క్రమంగా నలభై లక్షల మందికి చేరువవుతుందని నమ్ముతున్నా. అది ఈ సినిమా బలం. మౌత్టాక్తో సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రతి రోజూ మూడునాలుగు అద్భుతమైన సందేశాలొస్తున్నాయి. నిర్మాతగా నా ఇరవైఏళ్ల ప్రయాణంలో ఈ సినిమాను ఎంతగానో ఆస్వాదిస్తున్నా. కుటుంబం, ఊరుతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. మెగాస్టార్ చిరంజీవిగారు ఈ సినిమా గురించి గంటసేపు మాట్లాడారు. ఎన్నో అవార్డులు గెలుచుకుంటుందని చెప్పారు. నా దృష్టిలో అదే అసలైన విజయం’ అన్నారు. దర్శకుడు వేణు మాట్లాడుతూ ‘ఇలాంటి మూలాలున్న కథను ఎంకరేజ్ చేసిన నిర్మాతలు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డికి కృతజ్ఞతలు. టీమ్ అందరూ నిజాయితీగా కష్టపడటం వల్ల ఈ విజయం సాధ్యమైంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, చల్లా ధర్మారెడ్డి, దర్శకులు హరీష్శంకర్, వేణుశ్రీరామ్, పరశురాం, సీనియర్ నటుడు అలీ తదితరులు పాల్గొన్నారు.
‘బలగం’గొప్ప సినిమా
‘బలగం’ చిత్రంపై అగ్ర నటుడు చిరంజీవి ప్రశంసలు కురిపించారు. పక్కా నేటివిటీ ఉన్న తెలంగాణ బతుకు చిత్రమిదని కొనియాడారు. శుక్రవారం ‘బలగం’ చిత్ర బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘వేణు అద్భుతంగా దర్శకత్వం వహించాడు. ఈ కథలో నిజాయితీ ఉంది. తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. గతంలో వేణు జబర్దస్త్ షోలో ఒగ్గు కథలు చేయడం చూశాను. వాటిని ఈ సినిమాలో చూపించడం అభినందనీయం. ఈ సినిమా చూసిన తర్వాత వేణుపై గౌరవం పెరిగిపోయింది. ‘బలగం’ నిజంగా గొప్ప చిత్రం’ అన్నారు.