ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బలగం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. వేణు ఎల్దండి దర్శకుడు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో చిత్రంలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…‘తెలంగాణ పల్లె ప్రాంతానికి చెందిన కథ ఇది. కుటుంబ భావోద్వేగాలతో సాగుతుంది. పాత్రలన్నీ మన జీవితాల్లో చూసినట్లే ఉంటాయి. ఈ సినిమాను చూసిన వారంతా చాలా బాగుందని చెప్పారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన వస్తున్నది. ప్రియదర్శి, కావ్య క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ మెప్పిస్తుంది.
దిల్ రాజు ప్రొడక్షన్స్లో కొత్త నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తాం. ప్రతిభావంతులైన వారిని ప్రోత్సహిస్తాం. ఈ చిత్రంలోనూ దర్శకుడు వేణు సహా చాలా మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చాం’ అని అన్నారు. దర్శకుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ..‘నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. బలగం చిత్రాన్ని త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. భీమ్స్ సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంటాయి. హీరో మేనత్తగా విజయలక్ష్మి, తల్లిగా స్వరూప, బాబాయ్ పాత్రలో మొగిలి..ఇలా కొత్త నటీనటుల ప్రతిభను తెరపై చూస్తారు’ అన్నారు.