Bala Krishna | ఆంధ్రప్రదేశ్లో మరో చిన్నారి ప్రాణాల కోసం అందరు తమ వంతు సాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలుకు చెందిన పునర్విక కేసు తర్వాత ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి కేయాన్ష్ అద్విక్ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నాడు.ఈ చిన్నారి అరుదైన Spinal Muscular Atrophy (SMA టైప్-2) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. గత 21 నెలలుగా ప్రాణాలతో పోరాడుతున్న ఈ బిడ్డను కాపాడేందుకు వైద్యులు అత్యవసరంగా ఒక ప్రత్యేక ఇంజెక్షన్ అవసరమని సూచించారు. అయితే ఆ ఔషధం ధర సుమారు రూ.16 కోట్లు కావడం కుటుంబానికి భారంగా మారింది.
కేయాన్ష్ అద్విక్ తండ్రి నటరాజు, తల్లి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో, సహాయం కోసం ప్రజలను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయం తెలిసిన హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు.చిన్నారి పరిస్థితి తెలుసుకున్న బాలకృష్ణ చలించిపోయి వెంటనే తనవంతు సాయం అందించారు. అంతేకాకుండా ప్రభుత్వ సహాయం కూడా అందేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్టు చేస్తూ, ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి చిన్నారి ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వైద్యుల ప్రకారం, ఈ వ్యాధికి అవసరమైన AVXS-101 (Onasemnogene Abeparvovec) అనే ఔషధం ఒక్కసారి మాత్రమే ఇవ్వాల్సిన జీవరక్షక ఇంజెక్షన్. ఇది భారతదేశంలో తయారు కాకపోవడం వల్ల విదేశాల నుంచి తెప్పించాల్సి వస్తోంది. అందుకే దీని ధర అత్యంత అధికంగా ఉంది.
ఇటీవల #SavePunarvika క్యాంపెయిన్ ద్వారా ప్రజలు కలిసి ఒక చిన్నారి ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు కేయాన్ష్ అద్విక్ కోసం కూడా సోషల్ మీడియాలో సహాయం కోసం పిలుపులు మొదలయ్యాయి. సమాజ సేవలో ముందుండే బాలకృష్ణ, ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎన్నో పేదలకు వైద్య సహాయం అందిస్తున్నారు. ఇప్పుడు తన నియోజకవర్గానికి చెందిన ఈ చిన్నారి కోసం కూడా ప్రజల సహకారం కోరడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిన్నారి కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. “ఈ చిన్నారి ప్రాణాలు కాపాడాలి” అంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. త్వరగా అవసరమైన రూ.16 కోట్లు సమకూరి, కేయాన్ష్ ఆరోగ్యంగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.