ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. మంగళవారం సినిమా టికెట్ల రేట్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఏపీ సర్కారు ఇచ్చిన జీవో నెం.35ని కొట్టేసింది హైకోర్టు. పాత విధానంలో టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. అయితే టికెట్ రేట్లపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. డివిజన్ బెంచ్కి వెళ్లాలని నిర్ణయించింది.
ఏపీ ఆన్లైన్ టిక్కెట్ల విషయంపై తాజాగా బాలకృష్ణ స్పందించారు. ఆయన దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి తాజాగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. టికెటింగ్ విధానం ఉన్నప్పటికీ సినిమా బాగుందన్న ధైర్యంతో ధైర్యంగా ముందుకు వెళ్ళాము. ఏపీ హైకోర్ట్ ఆ జీవోను రద్దు చేసినప్పటికీ ప్రభుత్వం మళ్ళీ అప్పీల్ కు వెళ్తుంది. అది అలాగే నడుస్తుంది. అన్నింటికీ ప్రిపేర్ అయ్యి , సినిమా మీద, ప్రేక్షకుల మీద నమ్మకంతో, అమ్మవారి ఆశీస్సులతో సినిమాను విడుదల చేశాము.
దేవుడు న్యాయనిర్ణేత. ఒక్కొక్క శబ్దంలో ఒక పవర్ ఉంటుంది. దేవుడు కరోనా నుంచి కాపాడుతున్నాడు. అలాగే ప్రేక్షక దేవుళ్ళు సినిమాకు ‘అఖండ’ విజయం అందించారు. వారికి ధన్యవాదాలు అని అన్నారు బాలయ్య. ఇక టిక్కెట్ల గురించి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు హైకోర్ట్ ఇచ్చిన తీర్పుకు ప్రభుత్వం మళ్ళీ అప్పీల్ కు వెళ్తుంది. ముందుముందు ఏం జరుగుతుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు సినిమా కాపాడింది… మేము సినిమా ఇండస్ట్రీని కాపాడతాం అని చెప్పకొచ్చారు బాలయ్య.