‘ఓ ప్రేక్షకుడిగా నేను ఈ సినిమాను ఆస్వాదించాను. ప్రివ్యూ చూసిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. అంతలా నన్ను ఈ సినిమా కదిలించింది’ అన్నారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. సోమవారం జరిగిన ‘బేబీ’ చిత్ర సక్సెస్మీట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాయిరాజేష్ దర్శకత్వం వహించారు. ఎస్.కె.ఎన్ నిర్మాత.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘నేను హీరో కాకముందు ప్రతీ సినిమాను ఎంజాయ్ చేసేవాడిని. నటుడయ్యాక ప్రొఫెషనల్ కోణంలో సినిమా చూడటం అలవాటైంది. అయితే ‘బేబీ’ చిత్రం నేను నటుణ్ణి అని మరిచిపోయేలా చేసింది. ఓ సామాన్య ప్రేక్షకుడిలా ఈ సినిమాలో భావోద్వేగాలతో సహానుభూతి చెందాను. ఆనంద్ సోదరుడిగా ఈ సినిమా విజయం నాకెంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నా’ అన్నారు.
‘ఆనంద్ దేవరకొండ తన నటనతో కన్నీళ్లు పెట్టించాడు. ఎస్.కె.ఎన్ నాకు ఈ చిత్ర కథ చెప్పినప్పుడు మంచి సినిమా అవుతుందని ప్రోత్సహించాను’ అని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తున్నదని నిర్మాత ఎస్.కె.ఎన్ తెలిపారు. సినిమా అద్భుత విజయం పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.