‘ప్రేమ వల్ల వచ్చే సంతోషం కన్నా..బాధనే జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. మనిషిని జీవితాంతం వెంటాడుతుంది. ఇదే అంశాన్ని మా సినిమాలో చూపించాం’ అన్నారు సాయిరాజేష్. ఆయన దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. ఎస్.కె.ఎన్.నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం థాంక్స్మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయిరాజేష్ మాట్లాడుతూ ‘నా జీవితంలోని స్వీయ అనుభవాల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. ప్రేమ విఫలమైతే ఆ బాధ ఎలా ఉంటుందో చూపించాలనుకున్నా. హీరో కోణం నుంచి కథ రాసుకున్నా. హృద్యమైన ప్రేమకథగా అందరిని ఆకట్టుకుంటున్నది’ అన్నారు.
మూడేళ్ల కష్టానికి ఫలితమే ఈ సినిమా విజయమని నిర్మాత ఎస్.కె.ఎన్ ఆనందం వ్యక్తం చేశారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘థియేటర్లో ప్రేక్షకుల మధ్య సినిమా చూశా. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే కథ ఇది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికి కృతజ్ఞతలు’ అన్నారు. కథానాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ‘నా తొలిచిత్రమిది. ప్రాణం పెట్టి పనిచేశాను. థియేటర్లో ప్రతీ సీన్కు చప్పట్లు కొడుతున్నారు. నా పాత్రకు మంచి గుర్తింపు దక్కడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.