ఆది సాయికుమార్ కమర్షియల్ హిట్ను దక్కించుకొని చాలా కాలమైంది. భిన్నమైన కథాంశాల్ని ఎంచుకుంటూ సక్సెస్ను అందుకోవాలని బలంగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అతిథి దేవోభవ’. రాజబాబు మిర్యాల, అశోక్రెడ్డి మిర్యాల ఈ చిత్రాన్ని నిర్మించారు. పొలిమేర నాగేశ్వర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. కొవిడ్ ఉథృతితో ఆర్ఆర్ఆర్ వాయిదాపడటంతో ఆ రిలీజ్ డేట్కు ఉన్న క్రేజ్ను వాడుకుంటూ ఈసినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ద్వారా ఆది సాయికుమార్కు హిట్ దక్కిందా?కొత్త దర్శకుడు ప్రతిభను చాటాడా?లేదా?అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే…
అభయ్(ఆది సాయికుమార్) తెలివైన యువకుడు. సొంతంగా ఓ సాఫ్ట్వేర్ సంస్థను నిర్వహిస్తుంటాడు. అతడికి చిన్న తనం నుంచి మోనో ఫోబియా సమస్య ఉంటుంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడైనా ఒంటరిగా ఒక్క క్షణం కూడా ఉండలేడు. ఒంటరిగా ఉండాల్సివస్తే అతడిలో చనిపోవాలనే ఆలోచనలో మొదలవుతాయి. అమ్మ(రోహిణి) ప్రేమ ద్వారా తనకున్న సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటాడు. మోనోఫోబియా కారణంగా ప్రేమించిన అమ్మాయి అభయ్కి దూరమవుతుంది. ఈ క్రమంలో వైష్ణవి(నువేక్ష) అతడి జీవితంలోకి వస్తుంది. తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. అభయ్ మంచితనాన్ని చూసి వైష్ణవి అతడిని ఇష్టపడుతుంది. అభయ్ని పెళ్లిచేసుకోవాలనుకుంటుంది.
ఓ రోజు అభయ్ ఒంటరిగా తన ఇంట్లో ఉండాల్సివస్తుంది. ఈ క్రమంలో ఓ అమ్మాయి అతడి ఇంటికి అతిథిగా వస్తుంది. మోనోఫోబియా కారణంగా ఆమెను తన ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అభయ్ ప్రయత్నాలు చేయడంతో అతడిని సైకోగా భావిస్తుంటుంది ఆ యువతి. అదే సమయంలో వైష్ణవి కూడా అభయ్ కోసం అతడి ఇంటికి వెళుతుంది. ఆమెతోనూ అభయ్ అలాగే ప్రవర్తిస్తాడు. ఈ పరిణామాల కారణంగా అభయ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు? ఆ తర్వాత ఏమైంది? అభయ్ తన సమస్య గురించి వైష్ణవికి చెప్పాడా?ఆమె ప్రేమను పొందగలిగాడా? మోనోఫోబియా నుంచి అభయ్ బయటపడగలిగాడా? లేదా?అన్నదే ఈ చిత్ర కథ.
ఫోబియా సమస్యలతో తెలుగు తెరపై వచ్చిన పలు భలే భలే మగాడివోయ్, మహానుభావుడు లాంటి సినిమాలు చక్కటి విజయాల్ని అందుకున్నాయి. ఆ పాయింట్ను నమ్మే దర్శకనిర్మాతలు మోనో ఫోబియా అనే అంశాన్ని తీసుకొని సినిమాను తెరకెక్కించినట్లుగా అనిపించింది. ఈ సమస్య చుట్టూ ఫ్యామిలీ డ్రామా, వినోదం, ప్రేమకథను అల్లుకుంటూ కథను రాసుకున్నారు. ఒంటరిగా ఒక్క క్షణం కూడా బతకలేడు అన్న పాయింట్ బాగానే ఉన్నా దానిని బలంగా తెరపై మాత్రం చూపించలేదు. తనకున్న సమస్యను అర్థం చేసుకునే తోడు కోసం వెతుక్కునే క్రమంలో హీరో ఎదుర్కొనే సంఘర్షణలో ఆసక్తి లోపించింది. మోనోఫోబియా నుంచి చక్కటి వినోదాన్ని రాబట్టుకునే అవకాశం ఉంది. అయితే ఆ నవ్వులన్నీ ఒకటి అరా సన్నివేశాలకే పరిమితమయ్యాయి.
హీరోకు ఉన్న సమస్యను వివరిస్తూ కథ మొదలవుతుంది. ఆ పరిచయఘట్టాల్లోనే అతడి కష్టాలేమిటో దర్శకుడు పూర్తిగా చూపించాడు. ఆ తర్వాత ఆది, సప్తగిరి కామెడీ ట్రాక్లు, నాయకానాయికల లవ్ ఎపిసోడ్స్తో ప్రథమార్థంలో కాలక్షేపం చేశారు. ఒక రోజు ఒంటగా హీరో ఉండాల్సిన పరిస్థితులతో ద్వితీయార్థం పూర్తిగా థ్రిల్లింగ్గా మలిచారు దర్శకుడ. అయితే కానీ ఆ సన్నివేశాలన్నీ లాజిక్లకు దూరంగా సాగుతాయి. హీరోకు ఉన్న సమస్యను కథానాయిక అర్థం చేసుకునే సన్నివేశాలను హృద్యంగా మలచలేకపోయారు.
గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఆది సాయికుమార్ కనిపించారు. చాలా సెటిల్డ్గా నటించాడు. ఆద్యంతం ఎమోషనల్గా సాగే పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. నువేక్ష హావభావాల పలికించడం, యాక్టింగ్ విషయంలో పూర్తిగా తేలిపోయింది. తల్లి పాత్రలో సీనియర్ నటి రోహిణి నటన బాగుంది. ఆది, రోహిణి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయి. సప్తగిరి, గుండు సుదర్శన్ కామెడీ ఆకట్టుకోలేకపోయింది.
పొలిమేర నాగేశ్వర్కు ఇదే తొలి సినిమా. రచయిత వేణుగోపాల్ అందించిన కథను కమర్షియల్ పంథాలో తెరకెక్కించడంలో కొంత మేర సఫలమయ్యాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ను తెరపై చక్కగా ఆవిష్కరించాడు. చిత్ర నిర్మాత రాజబాబు, ఆయన సతీమణి రజని సంయుక్తంగా ఈ సినిమాకు స్క్రీన్ప్లే, సంభాషణలు అందించారు. డైలాగ్స్ సహజంగా ఉన్నాయి. సాహిత్యపు విలువల జోలికి పోకుండా నిత్యజీవితంలో ఉపయోగించే పదాలతోనే సంభాషణలు రాశారు. శేఖర్చంద్ర బాణీలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. మెలోడీ ప్రధానంగా ఆయన స్వరపరచిన ప్రతి పాట బాగుంది.
మోనోఫోబియా అనే పాయింట్ తప్ప కథ, కథనాల్లో ఎలాంటి కొత్తదనం లేదు. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియోన్స్ను కొంత వరకు ఆకట్టుకుంటుంది. పెద్ద సినిమాలు పోటీగా లేకపోవడం కలిసిరావచ్చు.
రేటింగ్-2/5