‘ప్రేమ, కుటుంబ విలువలతో పాటు చక్కటి వినోదాన్ని పంచే చిత్రమిది. ‘అతిథిదేవోభవ’ అనే పేరు వెనకున్న రహస్యమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని అన్నారు నిర్మాతలు రాజబాబు మిర్యాల, అశోక్రెడ్డి మిర్యాల. వారిద్దరు కలిసి నిర్మించిన తాజా చిత్రం ‘అతిథిదేవోభవ’. ఆదిసాయికుమార్, నువేక్ష జంటగా నటించారు. పొలిమేర నాగేశ్వర్ దర్శకుడు. ఈ నెల 7న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్లో నిర్మాత రాజబాబు మాట్లాడుతూ ‘ చిన్నతనంలోనే నాకు సినిమాల పట్ల ఆసక్తి మొదలైంది. సినిమా రూపకల్పనలో మా సోదరుడు మిర్యాల రవీందర్రెడ్డి ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. మేము మంచి సినిమా తీస్తామనే విశ్వాసం అతడికి ఉంది. ఈ సినిమాను నిర్మించడంతో పాటు డైలాగ్స్, స్క్రీన్ప్లేను నేనే అందించాను. సమాజంలో నేను చూసిన సంఘటనల, పరిశీలించిన అనుభవాలతో సంభాషణలు రాశా. కథను నమ్మి హీరోగా ఆదిని ఎంచుకున్నాం. గత చిత్రాలకు భిన్నంగా ఆయన నటన, పాత్రచిత్రణ ఉంటాయి. చాలా సెటిల్డ్గా నటించారు.
తొలుత ఈ నెల 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాం. కానీ ‘ఆర్ఆర్ఆర్’ వాయిదాపడటంతో ముందుకొచ్చాం. మొదటగా వేరే కథతో సినిమా చేయాలనుకున్నాం. కానీ భారీ బడ్జెట్తో తొలి ప్రయత్నం చేయడం రిస్క్ అనే ఆలోచనతో ఈ కథను ఎంచుకున్నాం. ఆది, రోహిణి కలయికలో వచ్చే ఎమోషన్స్, సప్తగిరి కామెడీ ప్రధాన బలంగా నిలుస్తుంది. తొలి సినిమా అనుభవం చాలా జ్ఞానం నేర్పించింది. సినిమా బాగా రావడం అనేది వందమంది ఆలోచనలపై ఆధారపడి ఉంటుందని అర్థమైంది. ఆ అనుభవాలను పాజిటివ్గానే తీసుకున్నా’ అన్నారు. బడ్జెట్ విషయంలో తాము ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని, తదుపరి సినిమా కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నామని అశోక్రెడ్డి పేర్కొన్నారు.