Owaisi On Kova Bun Issue | మేడారం జాతరలో కర్నూలుకు చెందిన చిరువ్యాపారి వలీని లక్ష్యంగా చేసుకుని వేధించిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎంఐఎం (AIMIM) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ తెలంగాణ పోలీసులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వ్యూస్ కోసం ఒక నిరుపేద వ్యాపారిని బహిరంగంగా అవమానించడం, అతనికి మత రంగు పులిమి వేధించడం అత్యంత హేయమైన చర్య అని ఒవైసీ పేర్కొన్నారు. కేవలం 10 రూపాయలకు కోవా బన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని “ఫుడ్ జిహాద్” పేరుతో భయభ్రాంతులకు గురిచేసిన యూట్యూబర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ఇటువంటి ధోరణిని మొగ్గలోనే తుంచివేయాలని ఆయన స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే?
మేడారం జాతరలో కర్నూలు జిల్లా వెలుగుగోడు గ్రామానికి చెందిన షేక్ షావలీ అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి కేవలం 10 రూపాయలకే కోవా బన్ విక్రయిస్తున్నారు. అయితే, వ్యూస్ మరియు లైక్స్ కోసం కొంతమంది యూట్యూబర్లు (తేజస్వి న్యూస్ ఛానల్) అతనిని చుట్టుముట్టి. ఆ ఆహారంలో ఏదో కలిపారంటూ, అది ‘ఫుడ్ జిహాద్’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా.. ఆ ఆహారం సురక్షితమేనని నిరూపించడానికి వలీని అందరి ముందే దానిని తినాలని బలవంతం చేసి వేధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ యూట్యూబర్ల తీరును తప్పుబట్టారు. తాజాగా ఇదే ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వలీకి అండగా నిలిచాడు.