ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ తెరకెక్కించిన అపురూప దృశ్య కావ్యం ‘రామాయణ్’. ఈ సీరియల్ 1980లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో రావణుడి పాత్ర పోషించిన అరవింద్ త్రివేది (82) మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసారు.అతని మృతికి సహా నటులు సునీల్ లాహిర్ (లక్ష్మణ్), దీపిక చిఖిలియా (సీత), అరుణ్ గోవిల్ (రామ్) మరియు ఇతరులు సంతాపం తెలియజేశారు.
గతంలో అరవింద్ కరోనాతో కన్నుమూసినట్టు పుకార్లు పుట్టించారు. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై రామాయణ్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహ్రీ స్పందించారు. అరవింద్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని సూచించారు. ఇప్పుడు ఆయన చనిపోయిన విషయాన్ని సునీల్ కన్ఫాం చేశారు. అతని మరణ వార్త విని మాటలు రావడం లేదని స్పష్టం చేశాడు.
లాక్డౌన్ నేపథ్యంలో రామాయణ్ సీరియల్ను దూరదర్శన్ పునఃప్రసారం చేసిన విషయం తెలిసిందే. రావణ పాత్రధారి అరవింద్ త్రివేది.. సీతాపహరణం దృశ్యాన్ని చూస్తున్న వీడియో ఆ సమయంలో వైరల్ అయింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 16న రామాయణ్ను 7.7 కోట్లు వీక్షించడంతో కొత్త రికార్డు నమోదయింది. రామానంద సాగర్ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ ధారావాహిక విడుదలైన 33 ఏళ్ల తర్వాత కూడా భారతీయ టెలివిజన్ ప్రపంచాన్ని ఏలడం గమనర్హం.
అరవింద్తో దిగిన ఓ ఫొటోని ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం ఎక్కువగా ఫేక్ న్యూస్ వినాల్సి వస్తోంది. అరవింద్ త్రివేది మృతి చెందారని వస్తోన్న పుకార్లు తాజాగా మా దృష్టికి వచ్చాయి. ఈ విధమైన వదంతులను వ్యాప్తి చేస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. దయచేసి ఇలాంటి వాటిని ఇకనైనా ఆపండి. దేవుడి దయవల్ల అరవింద్ జీ ఆరోగ్యంగానే ఉన్నారు’ అని సునీల్ పేర్కొన్నారు.