Art Director Sunil Babu Passes away | సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కేరళకు చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు(50) మరణించాడు. మూడు రోజుల క్రితం కాలు వాపు రావడంతో ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన సునీల్బాబుకు అకాస్మాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం రాత్రి 11 గంటలకు మరణించాడు. ఈయన మరణం పట్ల దక్షిణాది సినీ పరిశ్రమ సంతాపం ప్రకటిస్తుంది. ఆయనకు ఒక భార్య, కూతురు ఉన్నారు.
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ దగ్గర అసిస్టెంట్గా సునీల్ బాబు సినిమా రంగంలోకి ప్రవేశించాడు. 2005లో విడుదలైన ‘అనంతభద్రం’ చిత్రానికి ఉత్తమ కళా దర్శకుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఆ తరువాత సునీల్ ‘ఉరుమి’, ‘ఛోటా ముంబై’, ‘అమీ’, ‘ప్రేమమ్’, ‘బెంగుళూరు డేస్’, ‘లక్ష్యం’, ‘గజినీ’, ‘ఎంఎస్ ధోని’ వంటి పలు సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇక గతేడాది రిలీజైన ‘సీతారామం’ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాడు.
ఇక సంక్రాంతికి రిలీజ్ కానున్న ‘వారసుడు’ సినిమాకు కూడా సునీల్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇదే సునీల్ బాబు చివరి చిత్రం. వారసుడు రిలీజ్ అవకముందే సునీల్ మరణించడంతో చిత్రయూనిట్ విషాదంలో ఉండిపోయింది.