‘ఆది, సింహాద్రి, రాఖీ, యమదొంగ… ఇవి ఎన్టీఆర్ సినిమా పేర్లు కాదు. రాజమండ్రికి చెందిన ఓ నలుగురు కుర్రాళ్ల పేర్లు. వారి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు తేజ మార్ని. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటించారు. నిరంజన్రెడ్డి, అన్వేష్రెడ్డి నిర్మించారు. ఈ నెల 31 విడుదలకానుంది. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు కొరటాల శివ విడుదలచేశారు. నలుగురు స్నేహితుల కథతో వినోదం, యాక్షన్ అంశాల కలబోతగా ట్రైలర్ సాగింది. డిగ్రీ పూర్తిచేసి ఊరిలో స్నేహితులతో బలాదూర్గా తిరిగే అర్జున్ అనే యువకుడిగా శ్రీవిష్ణు కనిపిస్తున్నారు. పోలీసులు, రౌడీలను తప్పించుకుంటూ వారు చేసే పోరాటం థ్రిల్ను పంచుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘స్నేహం, ప్రేమ, కుటుంబ విలువలు కలబోసిన చిత్రమిది. పల్లెటూరి నేపథ్యంలో నవ్యానుభూతిని పంచుతుంది.నవ్విస్తూనే ఉత్కంఠకు లోనుచేస్తుంది’ అని అన్నారు. నరేష్, శివాజీరాజా, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి.