ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో బాలీవుడ్ నటులు విలన్ పాత్రలు పోషించడం ఒక ట్రెండ్గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రెండ్ తనకు ఏమాత్రం నచ్చడం లేదని తెలిపాడు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty). దక్షిణాది చిత్రాలలో హిందీ నటులకు కేవలం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు మాత్రమే ఆఫర్ చేయడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
బాలీవుడ్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. “నాకు సౌత్ నుంచి తరచూ ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే… మాకు నెగెటివ్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. హిందీ హీరోలను శక్తివంతమైన విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకు, ప్రేక్షకులకు అదే కిక్ ఇస్తుందని చెబుతున్నారు. నాకది ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే అలాంటి ఆఫర్లను నేను తిరస్కరిస్తున్నాను. రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ చిత్రంలో నెగెటివ్ రోల్ చేసిన మాట వాస్తవమేనని, అయితే రజనీ సర్తో కలిసి నటించాలన్న ఏకైక కోరికతోనే ఆ సినిమా ఒప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల తాను ‘జై’ అనే తుళు సినిమాలో కూడా నటించానని, ప్రాంతీయ సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే అందులో యాక్ట్ చేశానని, ఆ సినిమాకు మంచి ఆదరణ లభించిందని తెలిపారు.
అలాగే ఈ రోజుల్లో సినిమాకు భాషా సరిహద్దులంటూ లేవు. కంటెంట్ ఒక్కటే కింగ్. కంటెంట్ బాగుందంటే అది అన్ని హద్దులు దాటుకుని విజయజెండా ఎగరేస్తుంది అని సునీల్ శెట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలుగులో ‘మోసగాళ్లు’, ‘గని’ వంటి చిత్రాలలో నటించిన సునీల్ శెట్టి… ప్రస్తుతం ‘వెల్కమ్ టు ద జంగిల్’, ‘హేరా ఫేరి 3’ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు.