జనరంజకమైన గీతాల్ని రీమిక్స్ చేయడం తనకు నచ్చదని, ఆ ట్రెండ్కు తాను వ్యతిరేకమని చెప్పారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్. ఒరిజినల్ పాట తాలూకు ఔన్నత్యాన్ని దెబ్బతీసే ప్రక్రియగానే తాను రీమిక్స్ను పరిగణిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియన్ సెల్వన్-1’ చిత్రానికి రెహమాన్ స్వరాల్ని అందించారు. ఈ సినిమా ఈ నెల 30న విడుదలకానుంది.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుత సంగీత ధోరణులపై రెహమాన్ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఓ పాపులర్ పాటను రీమిక్స్ చేయడం అంటే ఒరిజినల్ కంపోజర్ విలువను తగ్గించినట్లేనని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘పాత పాటను తిరిగి మననం చేసుకోవడానికి రీమిక్స్ ఓ సాధనమనే విషయాన్ని నేను అంగీకరించను. ఒకరి సృజనాత్మక ప్రతిభను కాపీ కొట్టడం ఖచ్చితంగా తప్పవుతుంది’ అని అన్నారు. మణిరత్నంతో కలిసి ‘దిల్సే’ ‘గురు’ ‘యువ’ రావణ్’ వంటి చిత్రాలకు పనిచేశానని..అందులో ‘దిల్సే’ సినిమా తా లూకు స్వరప్రయాణం ఎన్నో అనుభూతుల్ని మిగిల్చిందన్నారు.