Ar Rahman | ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో భాగానికి సంగీతం అందించిన ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ‘వీరా రాజా వీర’ పాటపై కాపీరైట్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ పాట బాణీ తమ పూర్వీకులు స్వరపరిచిన శివస్తుతి నుండి తీసుకున్నదేనని ఆరోపిస్తూ ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ కోర్టును ఆశ్రయించారు. కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు కావడంతో ఈ వివాదం న్యాయపరమైన దిశగా సాగుతోంది.పలు దఫాల విచారణ అనంతరం గత ఏడాది ఏప్రిల్లో ఢిల్లీ హైకోర్టు ఈ పాట వినియోగంపై తాత్కాలిక ఆదేశాలు జారీ చేస్తూ రెహమాన్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ రెండు కోట్ల రూపాయలను జమ చేయాలని సూచించింది.
అయితే అదే ఏడాది సెప్టెంబర్లో డివిజన్ బెంచ్ ఆ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో ఫయాజ్ వసిఫుద్దీన్ తాజాగా సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా ను ఆశ్రయించారు. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్ మాల్య బాగ్చి సభ్యులైన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా రెహమాన్ ఆ పాట డాగర్వాణి సంగీత సంప్రదాయం నుండి ప్రేరణ పొందిందని ఇప్పటికే అంగీకరించారని, అలాంటప్పుడు ఆ సంప్రదాయానికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేరును ప్రస్తావించడం లో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. డాగర్ కుటుంబ సభ్యులు తొలుత ఈ స్వరాన్ని ప్రదర్శించారని పేర్కొనడం సమంజసమని, ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయమూర్తులు సూచించారు.
ఇప్పుడు రెహమాన్ తీసుకునే నిర్ణయం తుది తీర్పుపై ప్రభావం చూపదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఘరానాలకు చెందిన కళాకారులు శాస్త్రీయ సంగీతాన్ని పరిరక్షించే వారని, వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి బాగ్చి అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. దీంతో సంగీత రంగంలోనూ, సినీ వర్గాల్లోనూ ఈ కేసు ఆసక్తికరంగా మారింది.