బాలీవుడ్ అగ్రతారగా ఏళ్లపాటు వెలిగింది అనుష్క శర్మ. విరాట్ కొహ్లీతో పెళ్లయ్యాక సినిమాల వేగాన్ని తగ్గించింది. నిర్మాణ సంస్థ స్లేట్జ్ నుంచి కూడా తప్పుకుంది. ఇకపై సినిమాలు నిర్మించబోనని తెలిపింది. ఈ నిర్ణయాల వెనక కారణాన్ని తాజాగా వెల్లడించింది అనుష్క శర్మ. ఆమె మాట్లాడుతూ…‘సినీ రంగం అంటేనే నిత్యం విపరీతమైన పోటీ నెలకొని ఉంటుంది.
ఈ పరుగులకు అంతం లేదు. జీవితాన్ని ఆస్వాదించాలంటే ఈ పోటీ నుంచి ఏదో సమయంలో తప్పుకోవాల్సిందే. లేకుంటే వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతాం. పెళ్లయ్యాక వృత్తే జీవితం కాదనే విషయం తెలుసుకున్నా. గృహిణిగా, నటిగా రెండు బాధ్యతలను సమతూకం చేయడం చాలా కష్టం.
అది అందరూ అర్థం చేసుకోలేరు. నిర్మాణ సంస్థ నుంచి అందుకే తప్పుకున్నా. నటిగానూ పరిమితంగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నా. స్వానుభవంతో పనిచేసే మహిళలపై నాకు గౌరవం మరింత పెరిగింది’ అని చెప్పింది. ప్రస్తుతం అనుష్క శర్మ ‘చక్దా ఎక్స్ప్రెస్’ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమా భారత క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి బయోపిక్గా తెరకెక్కుతున్నది.