‘అంటే సుందరానికీ’ లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాను మరే చిత్రంతో పోల్చిచూడలేం. ఇలాంటి వైవిధ్యభరితమైన కథల్ని ఆదరిస్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగుల్లో మనం భాగమవుతాం’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘అంటే సుందరానికీ’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం విజయోత్సవ వేడుకను నిర్వహించారు. నాని మాట్లాడుతూ ‘ఇది మనందరి సెలబ్రేషన్. ఈ సినిమాకు వస్తున్న ఆదరణ, వెల్లువెత్తుతున్న అభినందనల్ని చూస్తుంటే కడుపు నిండిపోతున్నది.నా కెరీర్లో టాప్రేంజ్లో నిలిచిపోతుంది. ఇది ఆవకాయ్లాంటి సినిమాగా చెప్పొచ్చు. రోజులు గడుస్తున్నా కొద్ది రుచి పెరుగుతుంది’ అన్నారు.
‘మా సంస్థకు చిరకాలం గుర్తుండిపోయే క్లాసిక్ చిత్రమిది. నాని కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్గా భావిస్తున్నాం. దర్శకుడు వివేక్ ఆత్రేయ అంకితభావంతో పనిచేస్తారు. నాణ్యత కోసం అనుక్షణం తపిస్తారు. ఆయనతో వరుసగా సినిమాలు చేయాలని అనుకుంటున్నాం. ఈ సినిమా తీసినందుకు నిర్మాతలుగా గర్విస్తున్నాం’ అని నవీన్ యెర్నేని తెలిపారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ ‘ఈ సినిమా సక్సెస్ క్రెడిట్లో సింహభాగాన్ని హీరో నాని, నిర్మాతలకు ఇస్తాను. వారు కథను నమ్మారు కాబట్టే ఈ విజయం సాధ్యమైంది. సుందరం పాత్రలో నాని జీవించారు. ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటనను ప్రదిర్శించారు. ఈ సినిమా గురించి ప్రేక్షకులు ప్రేమలేఖల తరహాలో మూడు పేజీల వ్యాసాల్ని రాసి పంపిస్తున్నారు’ అని చెప్పారు. ఈ సినిమా విజయంతో తెలుగు ప్రేక్షకులు తనకు గొప్పగా ఆహ్వానం పలికారని కథానాయిక నజ్రియా నజీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.