( నేడు అక్కినేని జయంతి )
ANR | కొందరుంటారు.. వాళ్ల ప్రభావం ఎలా ఉంటుందంటే.. వాళ్లు ఎదగటంకాదు, వాళ్ల వల్ల వాళ్లున్న రంగం కూడా ఎదుగుతుంది. ఓ కొత్త ప్రపంచం ఆవిష్కృతమయ్యేంత ప్రభావం వారిది. ఓ చిన్న కథ, వారివల్ల చరిత్ర అవుతుంది. మందకొడి ప్రవాహాన్ని మలుపు తిప్పి, ఉరకలెత్తించటానికే పుడుతుంటారు వాళ్లు. మన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అలాంటివారే. తెలుగు సినిమా అంటే అక్కినేనికి ముందు, అక్కినేని తర్వాత అని చెప్పక తప్పదు.
ఎందుకంటే.. తెరపై కనిపించే బొమ్మని ప్రేక్షకుడు వ్యక్తిగతంగా అభిమానించడం మొదలైంది ఏఎన్నార్ నుంచే. అక్కినేని రాకముందు జనానికి ప్రధాన వినోదసాధనం నాటకం. అప్పట్లో సినీనటులు కూడా రంగస్థల కళాకారులే. అక్కినేని రంగస్థల నటుడే. కానీ ఆయనలో ఏదో ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే జనాన్ని థియేటర్లకు పరుగులుపెట్టించేలా చేసింది.
తెలుగుతెరపై తొలిమాస్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎన్టీయార్ రాకముందు వరకూ సినీరంగంలో ఏఎన్నార్ ఒక్కరే స్టార్హీరో. ఎన్టీయార్ వచ్చాక ఇద్దరయ్యారు. ఎటునుంచి చూసినా అక్కినేనికంటే అందగాడు, స్ఫురద్రూపి, మహానటుడు అయిన ఎన్టీయార్ని ఢీ కొనడమంటే సాధారణమైన విషయం కాదు. అందుకే శైలిని మార్చుకున్నాడు. తెలివితో యుద్ధం చేశాడు. పోటీ అంటే ఎలా ఉంటుందో పరిశ్రమకు పరిచయం చేశాడు.
ప్రత్యర్థి బలాన్ని గుర్తెరిగి ఎలా ముందుకెళ్లి విజయాలనందుకోవాలో నాగేశ్వరరావుకు తెలిసినంత ఏ హీరోకీ తెలీదంటే అతిశయోక్తి కాదు. అసలు తెలుగు సినిమాకు పోటీతత్వాన్ని పరిచయం చేసిందే అక్కినేని నాగేశ్వర్రావ్. ఆ పోటీ తత్వమే ఆయన్ను నటసామ్రాట్ని చేసింది. పద్మశ్రీగా, పద్మభూషణుడిగా, పద్మవిభూషణుడిగా.. దాదాసాహెబ్ఫాల్కే అవార్డు గ్రహీతగా ఆయన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది ఆ పోటీతత్వమే.
‘లైలామజ్ను’లో ఖైస్, ‘అనార్కలి’లో సలీం, ‘బాటసారి’లో సురేంద్రనాథ్, ‘అర్ధాంగి’లో రఘునాథరావు, ‘ప్రేమనగర్’లో కళ్యాణ్, ‘ప్రేమాభిషేకం’లో రాజేశ్, ‘మనసే మందిరం’లో డా.రఘు, మరీముఖ్యంగా దేవదాసు, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ.. ఈ పాత్రలను ఈ స్థాయిలో నటించి మెప్పించగల నటుడు భారతీయ చలనచిత్ర చరిత్రలో వేరొకరు కనిపించరనేది శిలాక్షరసత్యం.
దశాబ్దాలపాటు తన నటనతో ఆనందాన్ని పంచి తెలుగువారందర్నీ రుణగ్రస్తుల్ని చేశారు అక్కినేని. ఏఎన్నార్ అంటే క్రమశిక్షణకు మారుపేరు. ఏఎన్నార్ అంటే ఆర్థిక క్రమశిక్షణకు మరోపేరు. ఏఎన్నార్ అంటే అభినయానికి అసలు పేరు. నేటితో ఆయనకు 99ఏళ్లు నిండాయి. ఈ 100వ సంవత్సరమంతా అభిమానులకు పండగే. భౌతికంగా లేకపోయినా.. జన హృదయాల్లో ఆ మహానటుడు చిరస్మరణీయుడే.