‘విక్టోరియాపురం అనే ఓ గ్రామం నేపథ్యంలో ‘అన్నీ మంచి శకునములే’ చిత్ర కథ నడుస్తుంది. అనుబంధాలు కలబోసిన కొత్త ప్రపంచం అది. కథ వినగానే అందుకు తగినట్లుగా పాటలను సిద్ధం చేశా’ అన్నారు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. తెలుగులో మెలోడీ ప్రధాన గీతాలకు చిరునామాగా ఆయన్ని అభివర్ణిస్తారు. మిక్కీ జే మేయర్ స్వరాల్ని సమకూర్చిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఆయన పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి ఈ కథ చెప్పినప్పుడే మంచి పాటలకు స్కోప్ ఉందని అర్థమైంది. సంగీత దర్శకులు ప్రతీ సినిమాకు ఒకే రకమైన అంకితభావంతో పనిచేస్తారు. అంతిమంగా సినిమా బాగుంటేనే సంగీతానికి పేరొస్తుంది. ఈ చిత్ర నిర్మాతలు స్వప్న, ప్రియాంక మ్యూజిక్ డైరెక్టర్స్కు చాలా విలువిస్తారు. ‘మహానటి’ తర్వాత వారి సంస్థలో మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉంది. ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో ఆరు పాటలుంటాయి. ప్రతీ ట్యూన్లో వైవిధ్యం కనిపిస్తుంది. కొంచెం ఆలస్యమైనా సరే పాటల్లో కొత్తదనం చూపించాలనే ప్రయత్నం చేశా.
కొత్త కథలు కావాలి
కెరీర్ ఆరంభంలో ఎక్కువ సినిమాలకు పనిచేశాను. ఇప్పుడు చాలా సెలెక్టివ్గా ఉంటున్నా. స్వరకర్తగా అనుభవం పెరిగే కొద్ది కొత్త కథల కోసం అన్వేషణ మొదలవుతుంది. ప్రస్తుతం సినిమాలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. స్వతహాగా నాకు మెలోడీ పాటలంటే చాలా ఇష్టం. వాటినే ఎక్కువగా ఆస్వాదిస్తాను. మాస్ నంబర్స్తో పోల్చితే మెలోడీ గీతాలకు లైఫ్ ఎక్కువ. చాలా ఏళ్లపాటు అవి శ్రోతల్ని అలరిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం వరుణ్తేజ్ సినిమాకు పనిచేస్తున్నా. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. దిల్రాజు ‘సెల్ఫిస్’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నది. స్వప్న సినిమా బ్యానర్లో ‘ఛాంపియన్’ అనే సినిమాకు అంగీకరించా. మరో చిత్రాన్ని అమెరికన్ దర్శకుడితో చేయబోతున్నా. భిన్న అభిరుచులు కలిగిన దర్శకులతో పనిచేయడం వల్ల పాటల్లో కూడా వైవిధ్యాన్ని ప్రదర్శించగలుగుతున్నా.