తెలుగు చిత్రసీమలో ‘వైజయంతి మూవీస్’ స్థానం ప్రత్యేకం. ఎన్టీఆర్ మొదలు ఎందరో అగ్ర కథానాయకులతో మరపురాని చిత్రాల్ని నిర్మించి తిరుగులేని రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు సంస్థ అధినేత, అగ్రనిర్మాత అశ్వని దత్. ఇప్పుడు ఆ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు ఆయన కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంకదత్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’, ‘జాతిరత్నాలు’, ‘సీతారామం’ వంటి చిత్రాలతో అభిరుచి కలిగిన నిర్మాతలుగా సత్తా చాటారు. ఆ సోదరీమణులు తెరకెక్కించిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ సినిమా 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా స్వప్న దత్, ప్రియాంక దత్ పంచుకున్న ముచ్చట్లివి..
‘అన్నీ మంచి శకునములే’ కథలో ఎలాంటి మలుపులూ ఉండవు. అందమైన కుటుంబ కథగా అలరిస్తుంది. వేసవి సెలవుల్లో అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లి ఓ పదిరోజులు గడిపిన జ్ఞాపకాల మాదిరి చక్కటి అనుభూతిని అందిస్తుంది. కథంతా ఊటీ దగ్గరున్న కూనూర్ అనే హిల్ స్టేషన్ నేపథ్యంలో సాగుతుంది. మా చిన్నప్పుడు ఊటీలో షూటింగ్స్ ఉంటే నాన్న మమ్మల్ని తీసుకెళ్లేవారు. అలా ఆ ప్రాంతమంటే చాలా ఇష్టం ఏర్పడింది. అలాంటి హిల్స్టేషన్ బ్యాక్డ్రాప్లో ఓ ఫ్యామిలీ సినిమా తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. నందిని రెడ్డి కథ చెప్పగానే ఇదే సరైన సబ్జెక్ట్ అనిపించింది. విక్టోరియాపురం అనే ఓ కాల్పనిక గ్రామంలో రెండు కుటంబాల మధ్య ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ పట్టణాన్ని నిర్మించాం.
కథల ఎంపిక మొదలుకొని, కాస్టింగ్ వరకు ప్రతీ విషయంలో మేమిద్దరం కలిసి నిర్ణయాలు తీసుకుంటాం. ఎలాంటి అంచనాలు లేకుండా సాధారణ ప్రేక్షకుల్లా కథలు వింటాం. తెరపై ఈ కథ బాగుంటుందనే భావన కలిగితేనే సినిమా నిర్మాణం మొదలు పెడతాం. మేకింగ్ పరంగా సందేహాలుంటే నాన్నగారి సలహాలు తీసుకుంటాం. ‘సీతారామం’ చిత్రంలో ప్రకాశ్రాజ్, గౌతమ్మీనన్ వంటి నటుల్ని తీసుకుంటే బాగుంటుందనేది నాన్నగారి ఆలోచనే. ఆయన మాదిరిగానే మేము కూడా చిత్ర నిర్మాణంలో సమష్టి నిర్ణయాల ప్రకారమే నడచుకుంటున్నాం.
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మొదలుకొని ‘సీతారామం’ వరకు మా సంస్థ నిర్మించిన చిత్రాలన్నీ వాణిజ్యపరంగా విజయాలు సాధించడమే కాకుండా సరికొత్త ఇతివృత్తాలతో ప్రేక్షకుల మన్ననలు పొందాయి. మా మనసుకు నచ్చిన కథల్ని ఎంచుకొని సినిమాలు చేస్తున్నాం. కథలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాం. మేము ఎంతో ఇష్టపడి చేస్తున్న సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం అదృష్టంగా భావిస్తున్నాం. ‘సీతారామం’ విజయం గొప్ప సంతృప్తినిచ్చింది. ఆ సినిమా విషయంలో ప్రతి అడుగూ ఓ సవాలు అనిపించింది. పరభాషా హీరోను ఎంచుకోవడంతోపాటు ఖరీదైన లొకేషన్స్లో చిత్రీకరణ జరిపాం. కరోనా తర్వాత పరిస్థితుల వల్ల వ్యాపారపరంగా ఆశాజనకంగా అనిపించలేదు. ఈ అవాంతరాల్ని దాటుకొని గొప్ప చిత్రాన్ని అందించాం.
సినిమాల విషయంలో లెక్కలు వేసుకోవద్దన్నది మా సిద్ధాంతం. ఫిల్మ్ మేకింగ్ క్రియేటివ్ ప్రాసెస్. మనం ఇష్టపడ్డ కథను తెరపై తీసుకురావడానికి మించిన సంతృప్తి మరొకటి ఉండదు. అసలు లెక్కలు వేసుకుంటే సినిమాలు చేయకూడదు. నాన్నగారు 50 ఏండ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. రెండోతరంలో మేము కూడా సినిమాలు చేస్తున్నాం. నాన్నగారు ఏ రోజూ లెక్కలు వేసుకొని సినిమాలు చేయలేదు. అదే లక్షణం మాకు అలవడింది. ఒకవేళ నిజంగా డబ్బు సంపాదించాలనుకుంటే ఇదే పెట్టుబడితో రియల్ఎస్టేట్లో ఇంకా బాగా సంపాదించొచ్చు. మేము సినిమా నిర్మాణాన్ని పూర్తి ప్యాషన్తో చేపట్టాం. లెక్కలు వేసుకోకుండా మంచి కథలను ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నిస్తున్నాం.
ఏ సినిమా అయినా.. కథగా విన్నప్పుడు లిమిటెడ్ బడ్జెట్లో తీయాలని అనుకుంటాం. తెరపైకి వచ్చేసరికి లెక్కలు మారిపోతాయి. ‘మహానటి’ సినిమా పదికోట్లలో అయిపోతుందని నాన్నగారితో చెప్పాం. ఆయన చిరునవ్వు నవ్వి ‘రూ. కోట్ల లోపు ఆ సినిమా తీయండి చూద్దాం’ అన్నారు. ఒకసారి సినిమా సెట్స్మీదకు వెళ్లిందంటే కథ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టాల్సిందే. అప్పుడే అనుకున్న అవుట్పుట్ వస్తుంది.
సాధారణంగా ఏ ఒక్కరి అభిరుచులూ ఒకేలా ఉండవు. అలాగే మా ఇద్దరి ఆలోచనలు కూడా వేరుగా ఉంటాయి. మొదటి సినిమా విషయంలో మేము చాలా గొడవపడ్డాం (నవ్వుతూ). ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి అవగాహన వచ్చింది. కొన్ని విషయాల్లో తను పర్ఫెక్ట్. మరికొన్ని అంశాల్లో నా జడ్జిమెంట్ బాగుంటుంది. ఏమైనా డౌట్స్ వస్తే ఒకరినొకరు అడిగి క్లియర్ చేసుకుంటాం.
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదాలు మాకు ఉండవు. ఒకవైపు ప్రభాస్తో ‘ప్రాజెక్ట్-కె’ వంటి భారీ చిత్రాన్ని చేస్తూనే మరోవైపు ‘అన్నీ మంచి శకునములే’ వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించాం. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి చిన్న సినిమాతో మేము ప్రయాణాన్ని
మొదలుపెట్టాం. ప్రేక్షకులకు మంచి కథ చెప్పాలన్నదే నిర్మాతలుగా మా లక్ష్యం.
వైజయంతి మూవీస్ సినీరంగంలో యాభై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్కు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో వివరాల్ని వెల్లడిస్తాం. ఇక ప్రభాస్ కథానాయ కుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్-కె’ 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ముందుగా ప్రకటించినట్లుగానే వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల చేయనున్నాం. త్వరలో చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను పంచుకుంటాం. మా వైజయంతి మూవీస్ సంస్థలో ఎన్నో క్లాసిక్ చిత్రాలు తెరకెక్కాయి. అందులో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రానికి సీక్వెల్ చేయాలన్నది మా అందరి కోరిక.
…? సినిమా డెస్క్