Anna Konidela | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల సోషల్ మీడియాలో అడుగుపెట్టడంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చేరిన ఆమెకు మొదటి రోజే అద్భుతమైన స్పందన లభించింది. అకౌంట్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే లక్షల్లో ఫాలోవర్స్ చేరడం విశేషంగా మారింది.అన్నా కొణిదెల చేసిన పోస్టులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమె రీసెంట్గా షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన భర్త కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని వివరించిన ఆమె, మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుల గురించి ప్రత్యేకంగా స్పందించారు.
దాదాపు పదిహేనేళ్ల క్రితం ఈ కుటుంబంలోకి వచ్చినప్పుడు ఎలా కలిసిపోవాలో తెలియలేదు. ఎవరిని ఏమని పిలవాలో కూడా అర్థం కాలేదు. అందుకే నా భర్తను అనుసరించి అన్నయ్య, చిన్న అన్నయ్య అని పిలవడం ప్రారంభించాను. మొదట అది మాట మాత్రమే… కానీ తర్వాత అది నా మనసులోని భావంగా మారింది. నాకు సోదరుడు లేకపోయినా, జీవితం నాకోసం ఇద్దరిని ఇచ్చింది అంటూ ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ మెగా అభిమానులను కదిలించడంతో పాటు, కుటుంబ విలువలను ప్రతిబింబిస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆమె మొదటి పోస్టు తన వ్యక్తిగత పరిచయం గురించి ఉండగా, రెండో పోస్టులో పవన్ కళ్యాణ్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంది.
తన బయోలో “రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్” అని పేర్కొన్న అన్నా, రష్యాలో జన్మించి భారతీయ కుటుంబంలో భాగమై రెండు సంస్కృతులను అనుసరిస్తూ జీవిస్తున్నానని వెల్లడించారు. ప్రేమ, కృతజ్ఞతలతో జీవిస్తూ ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని తెలిపారు. సోషల్ మీడియాలోకి రావాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, ఇప్పుడు సరైన సమయం అనిపించిందని ఆమె పేర్కొన్నారు. మెగాస్టార్ ఆశీస్సులు, తన భర్త పవన్ కళ్యాణ్ మద్దతుతో ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆమె అకౌంట్కు ఫాలోవర్స్ వేగంగా పెరుగుతుండగా, రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్గా ఉంటారని, సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో ఆదరణ పొందే అవకాశముందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా అన్నా కొణిదెల ఎంట్రీ మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు.