Nag Ashwin | ‘కల్కి యానిమేషన్ వరల్డ్ కోసం ఒక చిన్న ఎంట్రీగా మేం తయారు చేసిన గ్లింప్స్.. మరో ఆరు గంటల్లో ప్రపంచమంతా చూడబోతున్నది. గత నాలుగేళ్లుగా ఈ సినిమాకోసం పనిచేస్తున్నాం. సినిమాకంటే ముందే యానిమేషన్ సిరీస్ను విడుదల చేయడం మా సంస్థ చేస్తున్న పెను సాహసం’ అన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఆయన దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అమితాబ్, కమల్హాసన్, దీపిక పదుకొనే, దిషా పటానీ లాంటి టాప్ స్టార్స్ భాగమైన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా సినిమా కంటే ముందు యానిమేషన్ సిరీస్ని మేకర్స్ విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా ‘బుజ్జి అండ్ భైరవ’ యానిమేషన్ సిరీస్ ట్రైలర్ను గురువారం హైదరాబాద్లో లాంచ్ చేశారు. ఇంకా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ- ‘ఈ యానిమేషన్ సిరీస్ అనేది నిజంగా కొత్త ప్రయత్నం. ‘చోటా భీమ్’తో పాటు ఎన్నో యానిమేషన్ సిరీస్లను రూపొందించిన గ్రీన్ గోల్డ్ సంస్థతో కలిసి ఈ సిరీస్ను రూపొందించాం. ఈ ‘కల్కి 2898ఏడీ’ నిర్మాణం వల్ల వైజయంతీ ఆటోమొబైల్స్, వైజయంతీ యానిమేషన్, వైజయంతీ మూవీస్.. ఇలా మూడు డిఫరెంట్ కంపెనీలను నడిపించామని సగౌరవంగా తెలియజేస్తున్నా’ అని తెలిపారు దర్శకుడు నాగ్అశ్విన్.