‘ఈ కథ రాసుకున్నప్పుడే సీక్వెల్ చేయాలనుకున్నాం. అంతటి స్పాన్ ఉన్న స్టోరీ ఇది. మొదటి భాగంతో పోల్చితే పదిరెట్లు థ్రిల్ ఫీలవుతారు’ అన్నారు డా॥ అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వంలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’. గౌరికృష్ణ నిర్మాత. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డా॥ అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ ‘గుడి అనే కామన్ పాయింట్ తప్పితే ‘కార్తికేయ’ చిత్రంతో మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. తొలిభాగం కంటే అనూహ్య మలుపులతో సాగుతుంది. ప్రేక్షకులు ఏమాత్రం ఊహించలేని ఎనిమిది ట్విస్ట్లుంటాయి. పతాకఘట్టాలు షాకింగ్గా అనిపిస్తాయి. తొలి భాగం ఓటీటీలో విడుదలకావడంతో రెస్పాన్స్ ఏమిటో తెలియలేదు. అయితే సినిమా చూసిన చాలా మంది సోషల్మీడియాలో పోస్టులు పెట్టడంతో మా ప్రాజెక్ట్పై మంచి హైప్ క్రియేట్ అయింది. నిర్మాత బన్నీవాసుగారికి మా సినిమా నచ్చడంతో ఇంకా పెద్దరేంజ్కు వెళ్లిందనుకుంటున్నాం. తాను ఎలాంటి పాత్రనైనా చేయగలనని సత్యం రాజేష్ నిరూపించుకున్నాడు. నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. ‘మా ఊరి పొలిమేర-3’ కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధంగా ఉంది’ అన్నారు.