Anil Ravipudi |టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తదుపరి సినిమా గురించి భారీ చర్చలు సాగుతున్నాయి. ఆయన తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచి 300 కోట్ల క్లబ్లో చేరిన తర్వాత, తదుపరి ప్రాజెక్ట్పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ఆయన నాగార్జున లేదా వెంకటేష్తో సినిమా చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ ప్రచారాలపై అనిల్ రావిపూడి తాజాగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇంకా తాను కొత్త ప్రాజెక్ట్కు సంబంధించి కథా చర్చలు కూడా మొదలుపెట్టలేదని తెలిపారు.
నేను ఇప్పటివరకు పేపర్పై పెన్ కూడా పెట్టలేదు. కానీ ఇప్పటికే హీరోలు, కథ, టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా చెప్పేస్తారేమో అనిపిస్తోంది అంటూ సరదాగా స్పందించారు. అభిమానుల ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకోగలనని పేర్కొంటూ, సరైన సమయం వచ్చినప్పుడు తాను చేయబోయే సినిమా, హీరో ఎవరు, కథ ఏంటి అనే పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం తన ఫోకస్ కొత్త కథను సిద్ధం చేయడంపైనే ఉందని, అప్పుడు మాత్రమే తదుపరి ప్రాజెక్ట్పై స్పష్టత వస్తుందని ఆయన సూచించారు.
‘మన శంకర వరప్రసాద్’ విజయంతో అనిల్ రావిపూడి మార్కెట్ మరింత పెరిగింది. దీంతో ఆయన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందనే ఉత్కంఠ అభిమానుల్లో సహజంగానే కనిపిస్తోంది. అయితే దర్శకుడి తాజా వ్యాఖ్యలతో ఇప్పటివరకు వినిపించిన వార్తలకు తాత్కాలిక బ్రేక్ పడినట్టే అయింది. ఇక ఆయన అధికారిక ప్రకటన వచ్చే వరకు తదుపరి ప్రాజెక్ట్పై సస్పెన్స్ కొనసాగనుంది.