Anil Ravipudi |ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి సక్సెస్ ఎక్కడ రాసిపెట్టి ఉంటే, అక్కడే వారికి అవకాశాలు లభిస్తాయన్నది తరచూ వినిపించే మాట. హీరోలు కావాలనుకుని ఇండస్ట్రీకి వచ్చి దర్శకులుగా స్థిరపడినవారు ఉన్నట్లే, దర్శకత్వ రంగంలోకి వచ్చి హీరోలుగా మారిన ఉదాహరణలూ ఉన్నాయి. నాని, రాజ్ తరుణ్ లాంటి వారు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసి తర్వాత హీరోలుగా సక్సెస్ సాధించారు. మరోవైపు కొందరు సక్సెస్ఫుల్ దర్శకులు కూడా హీరోగా మారాలని ప్రయత్నించి ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి హీరోగా మారతారా? అన్న ప్రశ్న తరచూ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
ఆయన స్టేజ్పై మాట్లాడే తీరు, కామెడీ టైమింగ్, మాస్ పల్స్ చూసి “హీరో మెటీరియల్” అంటూ అభిమానులు కామెంట్స్ చేయడం కొత్త కాదు. అయితే ఈ విషయంపై అనిల్ రావిపూడి ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హీరోగా సినిమా చేయొచ్చుకదా అని అడిగినప్పుడు అనిల్ రావిపూడి చాలా మెచ్యూర్డ్గా స్పందించారు. మనమొక క్రాఫ్ట్లో టాప్లో ఉన్నప్పుడు పక్కదారి పట్టించడానికి ఇలాంటి ప్రలోభాలు వస్తాయి. వాటికి లొంగితే ఇప్పటికే ఉన్న కెరీర్కే ప్రమాదం. అందుకే ఆ ట్రాప్లో నేను పడను. నాకు హీరోగా మారాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు. డైరెక్షన్పైనే పూర్తి దృష్టి పెడతాను అని ఆయన స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తుంది.
టాలీవుడ్లో దర్శకుడు రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ లేని ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్గా అనిల్ రావిపూడికి మంచి పేరు ఉంది. ఆ రికార్డును కాపాడుకోవడమే తన ప్రధాన లక్ష్యమని, నటన వైపు వెళ్లి ఫోకస్ డైవర్ట్ చేయాలనే ఆలోచన తనకు లేదని ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి పూర్తిగా మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపైనే దృష్టి పెట్టారు. 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేష్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. భారీ తారాగణం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంశాలతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.సంక్రాంతి సీజన్ అంటే అనిల్ రావిపూడికి ప్రత్యేకమైన సెంటిమెంట్ కూడా ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో ఆ సీజన్లో భారీ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు అదే నమ్మకంతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో మరోసారి సంక్రాంతి సక్సెస్ రిపీట్ అవుతుందనే విశ్వాసంతో ఉన్నారు.