Anil Ravipudi | టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఐపీఎల్పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హీరో సత్యదేవ్ (Satyadev) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ముఖ్య అతిథిగా వచ్చిన అనిల్ వేదికపై మాట్లాడుతూ.. ఈ మధ్య ప్రేక్షకుల సినిమాలు రాకపోవడంతో థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఐపీఎల్ సీజన్ కాబట్టి చెబుతున్న.. ఐపీఎల్ మ్యాచ్లు రెండు రోజులు చూడకుంటే కొంపలేం మునిగిపోవు. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రండి. క్రికెట్ స్కోర్ను మీ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు అని అనిల్ తెలిపాడు. దీంతో అనిల్ వ్యాఖ్యలపై విపరీతంగా ట్రోల్ నడిచింది. కొందరూ అయితే నీ సినిమాలు ఎవరు చూస్తారంటూ కామెంట్స్ పెట్టగా.. మరికొందరు సినిమాలు థియేటర్లో చూడకపోతే కొంపలేం మునిగిపోవు.. సినిమాలు ఓటీటీలో అయిన చూసుకోవచ్చు కానీ ఐపీఎల్ మ్యాచ్లు ఇచ్చే కిక్ మళ్లీ దొరకదు అంటూ ట్రోల్ చేశారు. అయితే ఈ వివాదం ముదురుతుండడంతో తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు అనిల్.
దాసరి నారాయణరావు జయంతి వేడుకలకు హాజరైన అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. మే 19న డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. మే 19న కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉంది. నేను ఇటీవల ఐపీఎల్ గురించి మాట్లాడిన మాటలు తప్పుగా కన్వే అయ్యాయి. ఐపీఎల్ చూడండి, సినిమాలూ చూడండి, నేనూ ఐపీఎల్ చూస్తుంటాం. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు. దర్శకరత్న దాసరి గారి జయంతి రోజు ప్రతిసారీ మనమంతా ఇలాగే కలవాలని కోరుకుంటున్నా. డైరెక్టర్స్ డే ఈవెంట్ కోసం మా దర్శకులంతా సిద్ధమవుతున్నాం. స్కిట్స్, మంచి మంచి పోగ్రామ్స్ చేయబోతున్నాం అంటూ వెల్లడించారు.