Anasuya Bharadwaj | రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా ఇటీవల వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ పాత్రను కేవలం గ్లామర్ కోసమే వాడరంటూ పెద్ది చిత్రయూనిట్పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ వివాదంపై ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పరోక్షంగా స్పందించింది.
సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం మాత్రమేనని సమాజాన్ని మార్చాల్సిన పూర్తి బాధ్యత సినిమాలపైనే పెట్టకూడదని అనసూయ అన్నారు. సినిమాలో ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే తెలివి ప్రేక్షకులకు ఉండాలని.. సినిమాలను చూసి పిల్లలను పెంచడం కరెక్ట్ కాదని ఆమె చెప్పారు. అదే సమయంలో, కథలు రాసే రచయితలు, దర్శకులు కూడా తమ బాధ్యతను మర్చిపోకూడదని.. ఎందుకంటే సమాజంలో ప్రజల ఆలోచనలను, ప్రవర్తనను మార్చే శక్తి సినిమాకు ఖచ్చితంగా ఉందని గుర్తుచేశారు.
ఒకప్పుడు సినిమాల్లో హీరో అంటే మంచివాడని, విలన్ అంటే చెడ్డవాడని అందరికీ స్పష్టంగా తెలిసేదని.. కానీ ఈ రోజుల్లో పాత్రలు చాలా గందరగోళంగా మారిపోయాయని ఆమె ఆందోళన పడ్డారు. సినిమాలో ఒక చెడును కేవలం చూపించారా? లేక ఆ చెడునే గొప్పగా చేసి చూపించారా? అనే తేడా ప్రేక్షకులకు అర్థం కాకుండా పోతోందని అన్నారు. తాను ఇలాంటి విషయాలపై మాట్లాడినప్పుడు కొందరు తనను తప్పుబడుతుంటారని.. కానీ తన ఉద్దేశం సినిమాలను ఆపడం కాదని, సమాజం పట్ల అందరికీ ఒక బాధ్యత ఉండాలనేదే తన తాపత్రయమని చెప్పారు. సినిమా తీసేవాళ్లకు, చూసేవాళ్లకు అందరికీ ఈ బాధ్యత వర్తిస్తుందన్నారు.
తాను ఎప్పుడూ ఇలాంటి సిద్ధాంతాలనే నమ్ముతానని.. గతంలో ఒక పెద్ద టీవీ షో నుండి తప్పుకోవడానికి కూడా ఇదే కారణమని అనసూయ చెప్పారు. తన అభిప్రాయాల వల్ల షో టీమ్ క్రియేటివిటీ దెబ్బతింటుందని కొందరు అన్నారని.. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకు టాలెంట్ ఉన్నా కూడా సరైన అవకాశాలు రాక ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. అయినా సరే తాను నమ్మిన నిజం కోసం నిలబడటంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. సినిమాల్లోని తప్పులను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న నెటిజన్లను ఆమె మెచ్చుకున్నారు. తప్పును ప్రశ్నించడం అంటే సినిమా స్వేచ్ఛను అడ్డుకోవడం కాదని, అది సమాజంలో ఒక మంచి మార్పుకు దారితీస్తుందని చెప్పారు. సినిమా తీసే స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, సమాజం పట్ల బాధ్యత కూడా అంతే ముఖ్యమని.. ఇకనైనా సినిమా వాళ్లు, చూసే ప్రేక్షకులు అందరూ మరింత బాధ్యతగా ఉంటారని ఆశిస్తున్నట్లు అనసూయ చెప్పారు.