వెయ్యికి పైగా పాటలు రాసి శ్రోతలకు అభిమాన పాటల రచయితగా మారారు అనంత శ్రీరామ్. ఆయన మొత్తం పాటలు రాసిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందించారు. నవీన్ యేర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు ఈ నెల 12న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా పాటల విశేషాలు తెలిపారీ గీత రచయిత. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ…‘ఈ సినిమా సందేశాత్మకంగా ఉంటూనే పూర్తిస్థాయి వాణిజ్య విలువలతో తెరకెక్కించారు. కథ వినగానే ఇలాంటి సినిమా ఐదేళ్లుగా రాలేదు, మరో ఐదేళ్లు రాదు అనిపించింది. నాకు ఇది సింగిల్ కార్డ్ మూవీ. అన్ని పాటలూ నేనే రాశాను. ఒక పాట పూర్తయ్యాక బాగుందని, మరో పాట ఇచ్చారు. అలా మొత్తం ఐదు పాటలు నేనే రాశాను. ప్రతి పాటా సందర్భానుసారంగా వస్తుంటుంది.
రెండేళ్ల కిందటి పాటలు కాబట్టి పాట ఎవరికి బాగా లేదనిపించినా మళ్లీ మళ్లీ పదాలను, వాక్యాలను మార్చుతూ వచ్చాం. ‘ఎవ్రీ పెన్నీ..’ సినిమాలో మొదటి పాట. ఈ పాటలో డబ్బు విలువ చెబుతూ ప్రపంచంలో ఎవరైనా శ్రమిస్తేనే డబ్బు సంపాదించగలరు. అందుకే ఆ డబ్బును ప్రేమించాలని చెప్పాం. ‘కళావతి..’ హీరో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడి ఆమె అందాన్ని పొగుడుతూ సాగుతుంది. ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ పాటలా వస్తుంటుంది. మరో పాట మాస్ సాంగ్లా ఉంటుంది. అది త్వరలో రిలీజ్ చేస్తున్నాం. సంగీత దర్శకుడు థమన్తో పనిచేయడం సంతోషంగా ఉంది. ఆయన రిథమ్లోనే ఒక లిరిక్ ఉంటుంది. దర్శకుడి సూచనల మేరకు పాటలు రాస్తుంటాను’ అన్నారు.