ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్కేఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 14న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా..నీ ప్రేమలో జీవిస్తున్నా..’ అని సాగే పాటను నాయిక రష్మిక మందన్న అతిథిగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ…‘ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ. అందరికీ నచ్చేలా తీర్చిదిద్దేందుకు పగలు రాత్రీ కష్టపడుతున్నాం.
కొన్ని ఏండ్ల తర్వాత కూడా ఈ పాటను వింటారు.’ అని చెప్పారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ…‘ఈ చిత్రంలోని ప్రతి పాట శ్రోతలకు చేరుతున్నది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. సహజత్వంతో సాగే ప్రేమ కథా చిత్రమిది. ఇలాంటివి తెరకెక్కడం అరుదుగా జరుగుతుంటుంది. మంచి కంటెంట్ను దర్శకుడు సాయి రాజేష్ చూపించబోతున్నారు.’ అన్నారు. దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ…‘మా కోసం వచ్చి పాటను విడుదల చేసిన రష్మికకు థాంక్స్. ఈ పాటకు సురేష్ మంచి సాహిత్యాన్ని అందించారు. రోహిత్ బాగా పాడారు. ఈ పాట ఛాట్ బస్టర్ అవుతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో విరాజ్ అశ్విన్, వైష్ణవి, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ తదితరులు పాల్గొన్నారు.