Anand Devarakonda | యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం టవర్లో ఎపిక్, తక్షకుడు వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఆయన, తాజాగా శ్రీ చిదంబరం గారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తాను చేస్తున్న కొత్త సినిమా పాత్ర గురించి చెప్పిన విషయాలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించాయి. శ్రీ చిదంబరం గారు చిత్రం మెల్లకన్ను సమస్యతో బాధపడే యువకుడి జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిన కథగా దర్శకుడు రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించిన వంశీ తన తొలి చిత్రంలోనే ఇలాంటి సవాలుతో కూడిన పాత్రను ఎంచుకోవడం సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈవెంట్లో మాట్లాడుతూ ఆనంద్ దేవరకొండ, “మూడు నెలల క్రితమే ఈ సినిమా టీజర్ చూశాను. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. వంశీ ఈ పాత్రను ఎలా పోషించాడో నిజంగా ఆశ్చర్యం వేసింది. నా రాబోయే సినిమా తక్షకుడులో నేను బ్లైండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. రెండు రోజులు షూట్ చేసిన తర్వాతే నాకు తలనొప్పి మొదలైంది. నేను అసలు మెల్లకన్ను పెట్టకపోయినా, ఎవరికీ ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా నటించడమే కష్టం అనిపించింది” అని చెప్పుకొచ్చారు. మీ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తుంటే లఅందులో మీ పర్ఫార్మెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్ట్ సినిమాకే ఇలాంటి పాత్ర చేయడం చాలా కష్టం. మీరు నిజంగా గర్వపడాల్సిన విషయం ఇది” అంటూ వంశీని అభినందించారు. ఆనంద్ వ్యాఖ్యలు అక్కడున్న ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అయితే తక్షకుడు సినిమాలో బ్లైండ్ పాత్ర కోసం ఆయన పడుతున్న కష్టాలపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ ప్రారంభ దశలోనే ఇంత కష్టం అనిపిస్తే సినిమా పూర్తయ్యే సరికి ఎంత శ్రమ పడతాడో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రీ చిదంబరం గారు సినిమాలో వంశీ నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తొలి చిత్రంతోనే విభిన్నమైన పాత్రను ఎంచుకోవడం అతనికి మంచి గుర్తింపును తీసుకురావొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.