బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ పలు టీవీ షోలలోను పాల్గొంటున్నారు.ఆయన కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ఎన్నో కష్ట సుఖాలని చవి చూశారు. రీల్, రియాలిటీ మధ్య ఉండే తేడా ఏంటో ఆయనకు బాగా తెలుసు. అయితే ఆయన తాజాగా ఓ సినిమాలోని సాంగ్ విని ఏడ్చేశారట.
సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా’)లోని ‘కయ్యిలే ఆగాశమ్.. కొండు వంద ఉన్ పాసమ్’ (తెలుగులో ‘అందని ఆకాశం దించవయ్యా మాకోసం’) అనే పాట చాలా మందికి కంట తడి పెట్టించింది. ఈ పాట విని అమితాబ్ కూడా ఎమోషనల్ అయ్యారట. ఊహించిన దానికన్నా ఎక్కువ జరిగే సమయాలు కొన్ని ఉంటాయి. నాకు అలాంటి సమయం ఎదురైందని అమితాబ్ పేర్కొన్నారు.
ఆ పాట విన్నప్పుడు నేను నా కన్నీళ్లను ఆపుకోవడానికి ఎంత ప్రయత్నించినా నావల్ల కాలేదు’’ అంటూ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పాట విన్నప్పుడల్లా కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సూర్య నటించిన ఈ పాటలో గుండె బద్దలు చేసే ఎమోషన్ ఉంది. సహజత్వానికి దగ్గరగా ఉన్న ఈ పాట నా కన్నీళ్లను ఆపలేకపోయింది. ఓ తండ్రీకొడుకు మధ్య ఉండే భావోద్వేగాన్ని ఆవిష్కరించిన పాట ఇది. నాతో ఈ ఎమోషన్ చాలాకాలం ఉండిపోతుంది’’ అని తన బ్లాగ్లో రాసుకొచ్చారు అమితాబ్ బచ్చన్. ఆయన ట్వీట్కి స్పందించిన స్వరకర్త జీవి ప్రకాశ్, 2డీ ఎంటర్టైన్మెంట్స్ ఆయనకు ధన్యవాదాలు తెలియజేసింది.