AMB Cinemas | సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ప్రారంభించిన ఏఎంబీ సినిమాస్ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్లో ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్ చైన్ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రస్థానాన్ని విస్తరించేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో, విలాసవంతమైన సదుపాయాలతో ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినీ అనుభూతిని అందిస్తున్న ఏఎంబీ సినిమాస్ ఇప్పటికే ప్రముఖ బ్రాండ్గా మారింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ఉన్న ఏఎంబీ సినిమా అండ్ మాల్ ప్రస్తుతం అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్లలో ఒకటిగా నిలిచింది. ఏడు స్క్రీన్లతో ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆధునిక సౌకర్యాలు, లగ్జరీ సీటింగ్ మరియు అత్యుత్తమ సౌండ్ టెక్నాలజీతో ఇది సినీ ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఇటీవల బెంగుళూరులోని గాంధీనగర్లో కూడా ఏఎంబీ సినిమాస్ అధికారికంగా ప్రారంభమైంది. అక్కడ ఉన్న పాత కాపాళీ థియేటర్ స్థానంలో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ తొమ్మిది స్క్రీన్లతో అత్యాధునిక సదుపాయాలతో రూపొందింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే మొదటి డాల్బీ సినిమా స్క్రీన్ను అక్కడ ప్రారంభించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన తర్వాత ఫిబ్రవరిలో మహేష్ బాబు స్వయంగా బెంగుళూరు వెళ్లి మాల్ను సందర్శించారు. ఇక హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో కూడా ఏఎంబీ క్లాసిక్ పేరుతో మరో ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. ఏడు స్క్రీన్లతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ మే లేదా జూన్ నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా బెంగుళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా మరో మల్టీప్లెక్స్ నిర్మాణానికి ఏషియన్ సినిమాస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా ఏఎంబీ సినిమాస్ ప్రారంభించాలని మహేష్ బాబు మరియు ఏషియన్ సినిమాస్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కూడా ఒక భారీ మాల్ మరియు మల్టీప్లెక్స్ నిర్మాణంపై చర్చలు జరిగినట్లు సమాచారం. వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అక్కడ భారీ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖలో ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఏఏ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఆ భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇనార్బిట్ మాల్ నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుంది. త్వరలో విశాఖలో మెట్రో పనులు కూడా ప్రారంభం కానున్నాయి.ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని విశాఖలో కూడా ఏఎంబీ సినిమాస్ ప్రారంభిస్తే మంచి అవకాశాలు ఉంటాయని మహేష్ బాబు బృందం భావిస్తున్నట్లు సమాచారం. గోవా, కేరళ ప్రాజెక్ట్లతో పాటు విశాఖ ప్రాజెక్ట్ను కూడా ప్రారంభించాలనే ఆలోచన జరుగుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.