అమలాపాల్, రాహుల్ విజయ్, పద్మిని సేట్టం, రాజ్ మాదిరాజ్ కీలక పాత్రల్లో నటించిన వెబ్సిరీస్ ‘కుడి ఎడమైతే’. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించిన ఈ సిరీస్ ఈ నెల 16న ‘ఆహా’ ఓటీటీలో విడుదలకానుంది. పవన్కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ట్రైలర్ను బుధవారం దర్శకురాలు నందినిరెడ్డి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఎనిమిది ఎపిసోడ్స్తో సాగే సిరీస్ ఇది. నలభై ఐదు రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశాం. ఇండియాలో మొదటిసారిగా టైమ్లూప్ పాయింట్ ఆధారంగా తెరకెక్కించిన సిరీస్ ఇది. దుర్గ, ఆది అనే ఇద్దరు వ్యక్తుల జీవితంలో ఒకే రోజు, ఒకే సమయం రిపీట్ అవుతుంటుంది. వీరిద్దరు ఓ రోడ్డు ప్రమాదంలో కలుసుకుంటారు. ఒకే టైమ్లూప్లో ఉండిపోయిన వీరిద్దరు దానికి పరిష్కారాన్ని ఎలా కనుగొన్నారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్గా ఆకట్టుకుంటుంది. దుర్గ అనే పోలీసాఫీసర్గా అమలాపాల్ కనిపిస్తుంది’ అన్నారు. తన ఆలోచనా విధానాన్ని మరింత పదునుపెట్టిన కథాంశమిదని అమలాపాల్ ఆనందం వ్యక్తం చేసింది.